ఏపీలో చివ‌రి నిముషంలో పొత్తు.. ఎవ‌రికి చేటు.. ?

ఎన్నిక‌ల వేళ ఆయా పార్టీల బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి.. పొత్తులు అనివార్యంగా మారుతున్న ప‌రిస్తితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు కూడా పొత్తుల‌కు తెర‌లెత్తుతున్నాయి. కానీ, ఎన్నికల వ‌ర‌కు తేల్చ‌క‌పోవ‌డం.. చివ‌రి నిముషం వ‌ర‌కు సాగ‌తీత ధోర‌ణిని అవ‌లంబించ‌డం వ‌ల్ల ఆయా పార్టీల‌కు మేలు ఎంత‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణలో జ‌న‌సేన‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంది.

కానీ, ఈ పొత్తుల విష‌యంలో బీజేపీ నోటిఫికేష‌న్ వ‌చ్చేసి.. ఇక‌, రేపో మాపో ఈ గ‌డువు కూడా అయిపోతుందన‌గా .. అప్పుడు ఒక కొలిక్కి తెచ్చారు. దీంతో బీజేపీ ఆశించిన ఫ‌లితం అయితే ద‌క్క‌లేదు. పైగా జ‌న‌సేనకు భారీ మైన‌స్ ఏర్ప‌డింది. చివ‌రి నిముషం వ‌ర‌కు ఈ పొత్తుల విష‌యం తెల్చ‌క‌పోవ‌డం.. అటు బీజేపీకి కూడా న‌ష్టం చేకూర్చింద‌నే వాద‌న ఉంది. నాయ‌కుల్లో నిరాశ‌, కేడ‌ర్‌లో నిస్స‌త్తువ ఆవ‌రించాయి.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. మ‌రో నాలుగు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే.. ఇక్క‌డ పొత్తుల విష‌యాన్ని తేల్చేయాల‌ని బీజేపీ నాయ‌కులు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ప్ర‌ధానంగా తెర‌మీదికి తెస్తున్నారు. అంతేకాదు, ఏదో ఒక విష‌యాన్ని తేలిస్తే.. ప్ర‌జ‌ల మైండ్ సెట్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

అలా కాకుండా.. కేవ‌లం ఎన్నిక‌ల‌కు ముందు పొత్తులు తేల్చ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను పార్టీవైపు మ‌ళ్లించడం.. వారిని సానుకూలంగా త‌మ‌వైపు తిప్పుకోవ‌డం వంటివి ఇబ్బందిక‌ర‌మ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ విష‌యంలో అయినా.. ముందుగానే మేల్కొనాలనేది బీజేపీ నేత‌ల టాక్‌. ఇదిలావుంటే.. టీడీపీ-జ‌న‌సేనల పొత్తు ఓకే అయినా.. బీజేపీ కోసం ఇరు ప‌క్షాలుద్వారాలు తెరిచే ఉంచాయి. అయితే, మోడీ ద్వ‌యం మాత్రం పొత్తుల‌పై లెక్క‌లు వేసేందుకు స‌మ‌యం తీసుకుంటుండ‌డం ఈ పార్టీల‌ను కూడా ఇబ్బంది పెడుతోందనే టాక్ వినిపిస్తోంది.