భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డి ఘన విజయం

Revanth Reddy

టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గంలో 32,800 ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డి విజయ దుందుభి మోగించారు. 20 రౌండ్లలో ప్రతి రౌండ్ కు 2000 మెజారిటీ సాధించిన రేవంత్ తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి పై ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో రేవంత్ కు 800 ఓట్లు దక్కాయి. దీంతో, ఓవరాల్ గా 33 వేల పైచిలుకు మెజారిటీతో రేవంత్ తన సొంత నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా, కామారెడ్డిలోనూ కేసీఆర్ పై దాదాపు 9 వేల ఓట్ల మెజారిటీతో రేవంత్ ముందంజలో ఉన్నారు.

పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కెసిఆర్ కాళ్లు మొక్కైనా నరేందర్ రెడ్డికి కీలక పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపి ఆయనకు భారీ మెజారిటీని కట్టబెట్టడం విశేషం.
అనూహ్యంగా కామారెడ్డిలో కేసీఆర్ మూడవ స్థానానికి పడిపోవడం బిఆర్ఎస్ శ్రేణులకు షాకిస్తోంది. కామారెడ్డిలో రేవంత్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, బిజెపి అభ్యర్థి రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో, కామారెడ్డిలో కూడా రేవంత్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతల ర్యాలీ మధ్య గాంధీభవన్ కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేలాదిమంది కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ కు చేరుకున్నాయి. బాణాసంచా కాలుస్తూ డప్పు వాయిస్తూ కాంగ్రెస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంకుంటున్నాయి. గాంధీభవన వద్ద రేవంత్ అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలు…జై బాబు అంటూ నినానాదాలు చేశారు. ఇక, గాంధీభవన్ కు రేవంత్ వెంట కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు.

సీఎం పదవి రేసులో రేవంత్ రెడ్డి ఉండడంతో కొడంగల్ ప్రజలు రేవంత్ కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. తమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉండాలని, అందుకు రేవంత్ ను గెలిపించుకోవాలని అందరూ ఫిక్సయ్యారని తెలుస్తోంది.