కమలం కుదేలైపోయిందా ?

పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు వచ్చేయడంతో బాగా డీలా పడిపోయిన పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ మాత్రమే. పోలింగ్ ముందు వరకు కూడా అధికారంలోకి రాబోయేది తామే అని ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన కమలనాదులు ఇపుడు ఎక్కడా చప్పుడు చేయటంలేదు. మొదటినుండి కూడా బీజేపీయేతర పార్టీల్లో కమలం పార్టీ గెలుచుకోబోయే నియోజకవర్గాల విషయంలో ఒక క్లారిటీ ఉంది. మిగిలిన పార్టీలన్నీ బీజేపీకి పట్టుమని పది సీట్లు కూడా రావని బహిరంగంగానే చెబుతున్నాయి.

అయితే బీజేపీ మాత్రం అధికారంలోకి రాబోయేది తామే అని పదేపదే చెప్పారు. సరే కమలనాదులు అలా చెప్పకుండా తాము అధికారంలోకి రావటంలేదని, పదిసీట్లు కూడా రావన్నది నిజమే అని ఎందుకు అంగీకరిస్తారు ? అయితే బీజేపీ విషయంలో మిగిలిన పార్టీలు లేదా విశ్లేషకుల అంచనాలు చాలావరకు నిజమే అయ్యేట్లున్నాయి. ఎలాగంటే చాలా నియోజకవర్గాల్లో పోటీచేయటానికి బీజేపీకి గట్టి అభ్యర్ధులే దొరకలేదు. ఒకవైపు నామినేషన్లు వేసే తేదీ దగ్గర పడుతున్నా, నామినేషన్ల గడువు ముగుస్తున్నా కూడా ఇతర పార్టీల నుండి వచ్చే గట్టి నేతలకోసం వెయిట్ చేసింది.

ఇక్కడే బీజేపీ పరిస్ధితి ఏమిటో అందరికీ అర్థమైపోయింది. ఇదే సమయంలో ఇతర పార్టీల్లో నుండి నేతలు వచ్చి చేరడం అటుంచితే బీజేపీలో నుండే గట్టినేతలు బయటకు వచ్చేశారు. బీజేపీ నుండి బయటకు వచ్చేసిన నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్, వివేక్, విజయశాంతి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరిపోయారు. నామినేషన్లకు ముందే బీజేపీ మీద దెబ్బపడిపోయింది.

ఇక నామినేషన్లు వేసి ప్రచారం చేసుకునే సమయంలో కూడా బీజేపీ అభ్యర్థుల్లో చాలా నియోజకవర్గాల్లో ఊపుకనబడలేదు. నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలాంటి బయట నేతలే తెలంగాణాలో బహిరంగసభల్లో పాల్గొనటం, ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొన్నారంటేనే అర్ధమైపోయింది పార్టీ ఎంత బలహీనంగా ఉందో. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న కాంగ్రెస్ ప్రచారాన్ని జనాలు నమ్మటంతో జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది. అందుకనే ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీ గెలుచుకోబో సీట్లు పదికి మించవని చెప్పింది. నిజంగా బీజేపీ పదిసీట్లు గెలిస్తే చాలా గొప్పగా పెర్ ఫార్మెన్స్ చేసిందనే అనుకోవాలి.