ఆంధ్రప్రదేశ్ నంబర్ టూ

ఒక ప్రమాదకర విషయం బయటపడ్డపుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ అదే ప్రమాదకర పరిస్థితి రోజుల తరబడి కొనసాగుతున్నపుడు.. ఒక దశ దాటాక అది మామూలు విషయం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం తాలూకు వార్తలు ఇలాగే తయారయ్యాయి. ఒకప్పుడు ఏపీలో వందల్లో కేసులు బయటపడుతుంటేనే తెగ భయపడిపోయే వాళ్లం. కానీ అది వేల స్థాయికి వెళ్లిపోయి చాలా కాలం అయింది.

ఒక దశలో రోజుకు పది వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. తొలిసారి ఆ మార్కును అందుకున్నపుడు వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇదే పరిస్థితి కొన్ని వారాలుగా కొనసాగుతోంది. కేసులు నిలకడగా పది వేల మార్కును టచ్ చేస్తున్నారు. రోజుకు 80-100 మంది మధ్య చనిపోతున్నారు. చూస్తుండగానే దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో పైపైకి వెళ్లిపోతోంది ఏపీ.

ఇప్పుడు ఏకంగా ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్. ఆదివారం నాటికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 24,767కు చేరుకుంది. ఆదివారం కూడా 10,603 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు (4,22,085)ను దాటేసి రెండో స్థానానికి ఎగబాకింది ఏపీ. యాక్టివ్ కేసుల్లోనూ ఏపీది రెండో స్థానమే. 99,129 యాక్టివ్ కేసులున్నాయి ఏపీలో. ఈ విషయంలో తమిళనాడు (52,721) చాలా మెరుగు.

మహారాష్ట్ర మొత్తం 7,80,689 కేసులతో అగ్ర స్థానంలో ఉంది. అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 1,93,548. ఏపీలో 3 లక్షల మందికి పైగానే కరోనా బాధితులు రికవర్ అయ్యారు. ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడా లేకుండా అన్ని చోట్లా కరోనా విలయం కొనసాగుతోంది. గోదావరి, చిత్తూరు లాంటి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటిదాకా ఏపీలో 3,884 మంది మరణించారు. ఇక ఇండియా మొత్తంలో కరోనా కేసులు 36 లక్షల మార్కును దాటేశాయి. ఇప్పటిదాకా 64,617 మంది కరోనా వల్ల చనిపోయారు.