బీఆర్ఎస్ లో ‘బాండ్ల’ కలకలం

బీఆర్ఎస్ లో కాంగెస్ పార్టీ ఇస్తున్న బాండ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రచారం యావత్తు కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారెంటీస్ మీదనే ఎక్కువగా దృష్టిపెట్టి ప్రచారం చేసింది. హస్తంపార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో జనాలు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సిక్స్ గ్యారెంటీలపైనే కేసీయార్, కేటీయార్, హరీష్ రావు కూడా పదేపదే ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. దాంతో ఏమైందంటే కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్ కు కేసీయార్ అండ్ కో కూడా బాగా ప్రచారం చేసినట్లయ్యింది.

ప్రచారం మరో వారంరోజుల్లో ముగుస్తుందనగా సడెన్ గా కాంగ్రెస్ అభ్యర్ధులు సిక్స్ గ్యారెంటీస్ అమలుకు బాండ్లను ఇవ్వటం మొదలుపెట్టారు. బాండ్ ఇవ్వటం అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని రాతమూలకంగా హామీ ఇవ్వటమే. మామూలుగా అయితే ఇప్పటివరకు రాజకీయపార్టీలు బహిరంగసభల్లో హామీలిచ్చేవంతే. మ్యానిఫెస్టోను ప్రత్యేకంగా రిలీజ్ చేసేవి. అయితే మ్యానిఫెస్టోను కానీ, బహిరంగసభల్లో ఇచ్చే హామీలను కాని అమలు చేయలేదని అడిగే ప్రజలు పెద్దగా ఉండేవారు కాదు.

సభల్లో ఇచ్చే హామీలు గాలికి అలాగే వెళ్ళిపోయేవి. కానీ ఇపుడు కాంగ్రెస్ కొత్త తరహాలో సిక్స్ గ్యారెంటీస్ అని ప్రకటించి వాటికి బాండ్ల రూపంలో సంతకాలు చేసి హామీలిచ్చింది. గడచిన వారం రోజులుగా చాలామంది అభ్యర్ధులు ఇలాంటి బాండ్లపై సంతకాలు చేసి జనాలకు పంపిణీ చేశారు. దాంతో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉంటామని రాతమూలకంగా హామీలిచ్చినట్లే. ఇది జనాల్లో మరింత సానుకూలతను పెంచింది. ఈ విషయమే గడచిన వారంరోజులుగా బీఆర్ఎస్ నేతల్లో బాగా చర్చనీయాంశమైంది.

పోయిన ఎన్నికల్లో కేసీయార్ ఇచ్చిన రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, దళిత, మైనారిటి, బీసీ బంధులు కూడా సరిగా అమలుకాలేదు. దీంతో కేసీయార్ ఇచ్చిన హామీలను, ఇపుడు కాంగ్రెస్ ఇచ్చిన బాండ్లను జనాలు పోల్చి చూసుకుంటున్నారని బీఆర్ఎస్ లో చర్చలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తీసుకొచ్చిన బాండ్ల ప్రచారం జనాల్లో మంచి ఎఫెక్ట్ చూపిస్తుందనే ఆందోళన అధికార పార్టీ అభ్యర్ధుల్లో పెరిగిపోతోంది.

పోయిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన ధర్మపురి అర్వింద్ కూడా పసుపు బోర్డు తీసుకొస్తానని ఇలాగే బాండ్ రాసి సంతకం చేయటం మంచి ఫలితం చూపించింది. అప్పుడు పోటీచేసిన కవిత ఓడిపోయింది. ఇపుడా బాండ్ నే కాంగ్రెస్ తెలంగాణా అంతటా అమల్లోకి తెచ్చింది.