35 వేల పోలింగ్ కేంద్రాలు.. 3 లక్ష‌ల మంది సిబ్బంది!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నెల 30న 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఎన్నిక‌ల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాదు.. నిరంతరం.. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఎన్నిక‌ల అధికారులు ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తున్నారు. ఎలక్షన్ ప్రిపరేషన్‌పై ఎన్నిక‌ల సంఘం నిశితంగా దృష్టి పెట్టింది.

ముఖ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన త‌ర్వాత‌.. తెర‌మీద‌కు వ‌చ్చే మద్యం, నగదు పంపిణీని కట్టిడి చేసేందుకు ప్ర‌త్యేక యంత్రాంగాన్ని రెడీ చేసింది. ఈ క్ర‌మంలో చివరి రెండు రోజులు కీలకమని సీఈసీ స్ప‌ష్టం చేసింది. ఇక‌, మావోయిస్టు – సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి.

ఇక‌, మొత్తం 2290 మంది అభ్య‌ర్థులు త‌ల‌ప‌డుతుండ‌గా.. వీరి జాత‌కాలు తేల్చేందుకు రాష్ట్రంలో 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. మొత్తం 33 జిల్లాల్లోని 13 జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. పోలింగ్ టైం ముగియగానే సెగ్మెంట్లు ఖాళీ చేయాలని స్థానికేతరులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

119 అసెంబ్లీ కేంద్రాలు, 2,290 అభ్యర్థులు, సింగిల్ ఫేజ్‌లో ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో భారీ ఎత్తున సీఆర్ పీఎఫ్ ద‌ళాల‌ను కూడా రంగంలోకి దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల బ్యాలెట్ యూనిట్లు, అదనంగా మరో 14వేలు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 30వ తేదీ పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించి.. తెలంగాణ సార‌థుల‌ను ఎన్నుకోనున్నారు.