ఉగాది తర్వాత.. ఏ క్షణమైనా.. బాబు కీలక నిర్ణయం..!

ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు. పనిచేస్తున్న వారిని కొనసాగించినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆయన పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తోంది. నాయకుల మధ్య వివాదాలు, విభేదాలతో సాగుతున్న మంత్రులను పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు.

ప్రస్తుతం మంత్రివర్గంలో 25 మంది ఉన్నారు. వీరిలో 7 నుంచి 9 మందిని తొలగించే అంశంపై క్లారిటీతోనే ఉన్నట్టు తెలుస్తోంది. వీరి స్థానంలో కొందరు కొత్తవారికి.. అదే సమయంలో సీనియర్లకు కూడా అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే పేర్లు ఇప్పటికే డిసైడ్ అయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మండలి నుంచి మంత్రులుగా ఎవరూ లేరు. ప్రస్తుతం ఉన్న మంత్రులు అందరూ ఎమ్మెల్యేలే. ఈ నేపథ్యంలో మండలికి కూడా ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.

ఈ క్రమంలో సోము వీర్రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం గమనార్హం. బీజేపీ సీనియర్ నేత అయిన సోమును ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒకరిని కూడా మంత్రిని చేస్తారని అంటున్నారు. వీరిలో కన్నా లక్ష్మీనారాయణ (సత్తెనపల్లి) పేరు వినిపిస్తోంది. ఆయనను కాదని అంటే తూర్పుకు చెందిన మరో నేతకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అదే సమయంలో ప్రస్తుతం మంత్రి వర్గం నుంచి బయటకు పంపించేవారి సామాజిక వర్గాలను హర్ట్ చేయకుండా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులను మంత్రులుగా తీసుకునే ఆలోచన చేస్తున్నారు. తద్వారా సామాజిక వర్గాలకు అసంతృప్తి లేకుండా చేయాలన్న వ్యూహంతోనూ చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మహిళల సంఖ్యను ఈ దఫా పెంచే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఉగాది తర్వాత ఏ క్షణమైనా మార్పులు ఖాయమని తెలుస్తోంది.