కాంగ్రెస్ అభ్యర్ధులకు భరోసా ఇచ్చారా ?

పోలింగ్ మరో 48 గంటలుందనగా కాంగ్రెస్ అభ్యర్ధులకు అలర్ట్ మెసేజెస్ అందుతున్నాయట. ఇంతకీ అందులో ఏముందంటే మరో 48 గంటలు జాగ్రత్తగా ఉండండి, పోల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకుంటే గెలుపు మీదే అని మెసేజెస్ లో ఉన్నట్లు సమాచారం. చివరినిముషంలో ఏమరుపాటు వద్దని చాలా అలర్టుగా ఉండండని వస్తున్న సమాచారం అగ్రనేతల నుండి కాదు. పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు నుండి. హైదరాబాద్ లోని ఒక హోటల్లో సునీల్ పార్టీలోని అగ్రనేతలకు ఎన్నికల ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారట.

సునీల్ అంచనాల ప్రకారమైతే కాంగ్రెస్ పార్టీ 70-80 సీట్ల మధ్య గెలుచుకుంటోందట. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు బాగా నెగిటివ్ గా ఉందని సునీల్ వివరించారట. అందుకనే కాంగ్రెస్ మొదటినుండి గ్రామీణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల పైనే ఎక్కువగా దృష్టి సారించిన విషయాన్ని వివరించారని పార్టీ నేతలు చెప్పారు. సునీల్ దృష్టిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 14 మాత్రమే నగరం పరిధిలోని నియోజకవర్గాలట.

ఇదే సమయంలో జిల్లాల కేంద్రాలుగా ఉన్న నియోజకవర్గాలు అర్బన్ నియోజకవర్గాలట. ఇవి మినహా మిగిలిన వన్నీ గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలే అని సునీల్ చెప్పారట. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను దృష్టిలో పెట్టుకునే తాను వ్యూహాలను రచించినట్లు చెప్పారు. పార్టీ కూడా మొదటినుండి ఇదే పద్దతిలో ఆలోచిస్తోంది. అందుకనే ఇద్దరి ఆలోచనలు సింక్ అవ్వటంతోనే రిజల్టు బ్రహ్మాండంగా రాబోతోందని సునీల్ స్పష్టంగా చెప్పారట. చివరి నిముషంలో కొన్నిచోట్ల అభ్యర్ధులను మార్చటం కూడా మంచి ఫలితాలు రావటానికి కారణాలవుతున్నట్లు చెప్పారట.

రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా రాబోయే ఫలితాలపై సునీల్ పవన్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారట. తన అంచనాల ప్రకారం క్షేత్రస్ధాయిలో రిపోర్టులన్నీ కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా ఉన్నట్లు గట్టిగానే సునీల్ చెప్పారట. చివరి నిముషంలో అభ్యర్ధులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫలితాలు అంత ఎక్కువగా వస్తాయన్న సునీల్ ఆలోచనలతో అగ్రనేతలంతా అంగీకరించాని సమాచరం. అందుకనే గెలుపుపై సునీల్ పార్టీ అగ్రనేతలతో పాటు అభ్యర్ధులకు అంత భరోసా ఇచ్చారని వినికిడి.