మంత్రులూ.. కౌంట్ డౌన్ స్టార్ట్‌: నారా లోకేష్‌

మంత్రులూ.. మీకు కౌంట్ డౌన్ స్టార్ట‌యింది! రోజులు లెక్క‌పెట్టుకోండి! అని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్వ‌రంతో హెచ్చ‌రించారు. తాజాగా ఆయ‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ను తిరిగి ప్రారంభించారు. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నుంచి ప్రారంభించిన ఈ యాత్ర‌లో వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌ను నారాలోకేష్ క‌లుసుకున్నారు. అనంత‌రం.. జిల్లా రాజోలు నియోజకవర్గం తాటిపాకలో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబును వ‌య‌సును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా.. 53 రోజుల పాటు జైల్లో ఉంచార‌ని.. దీని వెనుక వైసీపీ నేత‌లు వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేశార‌ని.. నారా లోకేష్ నిప్పులు చెరిగారు. తనపై నా సీఐడీ అధికారులు ఆరు కేసులు పెట్టారని.. అయినా.. తాను భ‌య‌ప‌డేది లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త‌న‌పైనా.. పార్టీ అధినేత చంద్ర‌బాబుపైనా పెట్టిన కేసుల్లో ఒక్క ఆధారమూ చూపలేకపోయారన్నారు.

ఏ తప్పూ చేయనందునే మళ్లీ యువ‌గ‌ళం ప్రారంభించాన‌ని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. “స్కిల్‌ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా? నాపై ఆరు కేసులు పెట్టారు.. అయినా వెనక్కి తగ్గం. మంత్రులకు చెబుతున్నా.. మీకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. నాడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వస్తుంటే ఎలా అడ్డుకున్నారో చూశాం. మాపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. మేం కూడా మీలాగే చేస్తే వైసీపీ నేతలంతా జైలులోనే ఉంటారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాదే” అని నారా లోకేష్ హెచ్చ‌రించారు.

చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అండగా నిలిచారని నారా లోకేష్ చెప్పారు. బాబును జైలుకు పంపితేయువ‌గ‌ళం పాదయాత్ర ఆగుతుందని, త‌ద్వారా పార్టీ కూడా నాశ‌నం అవుతుందని వైసీపీ కుటిల ప‌న్నాగాలు ప‌న్నింద‌ని చెప్పారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా యువగళం ఆగలేద‌న్నారు. జగన్‌ పాలనలో సామాజిక అన్యాయం జరిగిందని.. అనేక మంది దళితులను వేధించి చంపారని నిప్పులు చెరిగారు.