ముందు మీరు పంచండి.. త‌ర్వాత మేం ఇస్తాం!

అదే ప‌నిగా ఫోన్లు రింగ‌వుతున్నాయి. మెసేజ్‌ల‌పై మెసేజ్‌లు వ‌చ్చేస్తున్నాయి. వాట్సాప్ ఓపెన్ చేస్తే.. పుంఖాను పుఖాలుగా చాట్లు ద‌ర్శ‌న మిస్తున్నాయి. పోనీ.. ఫోన్లు ఎత్తుదామ‌న్నా.. మెసేజ్‌లు చ‌దువుతామ న్నా.. వాట్సాప్‌లో చాట్ చేద్దామ‌న్నా.. గుండెలు గుభేల్ మంటున్నాయి. ఇదీ.. రియ‌ల్ట‌ర్లు, పారిశ్రామిక వేత్త‌లు.. ముఖ్యంగా ప్రైవేటు ఫైనాన్స‌ర్ల ప‌రిస్థితి!! నిన్న మొన్న‌టి వ‌రకు ఆయ‌న మా నాయ‌కుడే అని చెప్పుకొన్నవారు.. ఈ పార్టీ మాదే అని న‌మ్మ‌కంగా ఉన్న‌వారు.. ఇప్పుడు షాక‌వుతున్నారు.

దీనికి కార‌ణం.. ముందు మీరు పంచండి.. త‌ర్వాత మేం ఇస్తాం! అనే డైలాగే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రియ‌ల్ట‌ర్లు, పారిశ్రామిక వేత్త‌లు.. ప్రైవేటు ఫైనాన్స‌ర్ల‌కు.. అన్ని బ‌డా పార్టీల నాయ‌కుల నుంచి ఇదే ఆఫ‌ర్లు వస్తున్నాయి. వీరిలో బీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థుల నుంచి కాంగ్రెస్‌, బీజేపీల వ‌రకు వంద‌ల సంఖ్య‌లో ఉన్నారు. ఎవ‌రిని కాద‌న్నా.. మ‌రొక‌రికి కోపం.. పోనీ.. అంద‌రికీ ఇచ్చేద్దామ‌న్నా.. ఈడీ, ఐటీ, సీబీఐ నిఘా నీడ‌. ఎటు నుంచి ఎలాంటి దాడి ఎదుర‌వుతుందో?  ఏమో అనే బెంబేలు.

వెర‌సి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట బ‌డా వ్యాపార వేత్త‌లంతా.. చెమ‌ట‌లు క‌క్కుతున్నారు. “ఇప్ప‌టికే రెండు కోట్ల రూపాయలు వ‌ర‌కు ఖ‌ర్చు చేశాను. దీనిని ఇస్తామ‌ని అంటున్నారు. కానీ.. ఎప్పుడిస్తారో తెలీదు. ఓడిపోతే ఇక‌, ఆ సొమ్ముకు నీళ్లొదులు కోవాల్సిందే. ఇప్పుడు మ‌ళ్లీ మ‌ళ్లీ అంటున్నారు. ఇంకా ఎక్క‌డ నుంచి తీసుకువ‌స్తాం. నా వ‌ల్ల‌కాదు“ అని వ‌రంగ‌ల్ జిల్లాలో బ‌డా రియ‌ల్ ఎస్టేట్ సంస్థ య‌జ‌మాని చెప్పిన మాట‌.

ఈ తాకిడి హైద‌రాబాద్‌లో మ‌రింత ఎక్కువ‌గా ఉందని అంటున్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కుముందే.. కొన్ని పార్టీల‌కు న‌జ‌రానాలు స‌మ‌ర్పించేసిన వారు ఉన్నారు. కానీ, అది కూడా చాల‌దు ఇంకా కావాలంటూ.. నాయ‌కులు పోరు పెడుతున్నారు. ప‌దే ప‌దే ఫోన్లు చేస్తున్నారు. చేయిస్తున్నారు. దీంతో విసిగిపోయిన రియ‌ర్ట‌ర్లు.. వ్యాపారులు ఫోన్లు ఎత్త‌డం మానేశారు. మ‌రికొంద‌రు.. పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోయారు. అయితే.. ఇంకొంద‌రు మాత్రం అప్పో సొప్పో చేసి.. 10 నుంచి 20 ల‌క్ష‌ల వ‌ర‌కు అభ్య‌ర్థుల‌కు స‌ర్దు బాటు చేస్తున్నారు. ఇక‌, ఇవ్వ‌లేమ‌ని చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ‌లో ప‌రిస్థితి ఇదీ.. !