ఏపీని వేధిస్తున్న ఐపీఎస్ ల కొరత

ఏపీలోని ఐపీఎస్ అధికారులకు సంబంధించిన చిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు ఐపీఎస్ లు రాష్ట్రానికి రావటానికి ఇష్టపడకుండా ఉండటం తెలిసిందే. మరికొందరు కేంద్రానికి వెళ్లిపోవటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మరికొందరు అధికారులు ఉన్నా.. వారికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వకుండా పక్కన పెట్టేసిన వైనం ఆసక్తికరంగా మారినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరత అంతకంతకూ ఎక్కువ కావటం ఇప్పుడో సమస్యగా చెప్పక తప్పదు.

ఏపీ వరకు చూస్తే.. ఆ రాష్ట్రంలో ఐపీఎస్ లు 144 మంది ఉండాలి. కానీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కేవలం 93 మంది మాత్రమే ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఏపీ సర్వీసులో ఉన్న అధికారుల్లో కొందరు కేంద్రానికి వెళ్లేందుకు సిద్దం కావటం గమనార్హం. ఏపీ ఐపీఎస్ ల విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

విభజన నేపథ్యంలో ఏపీకి కేటాయించిన పలువురు ఐపీఎస్ అధికారులు రాష్ట్రానికి రావటానికి ఇష్టపడలేదు. ఇలాంటివారిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న అంజనీ కుమార్.. రంగనాథ్.. అనంత శర్మ.. పరిమళ తదితర అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఏపీ సర్వీసులో ఉన్న మరికొందరు ఐపీఎస్ అధికారులు (అంజనా సిన్హా.. మధుసూదన్ రెడ్డి.. ఆకే హరికృష్ణ.. ఎస్ఎస్ త్రిపాటి) కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. దీంతో.. పలు స్థాయిల్లో అధికారుల్ని నియమించేందుకు కొరత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నలుగురు అధికారులకు ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వకుండా ఖాళీ ఉంచటం గమనార్హం. ఇక.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఉన్నప్పటికీ.. రాష్ట్ర క్యాడర్ కు చెందిన వారు కేంద్రానికి వెళ్లటం ఎక్కువైనట్లు ఉందన్న మాట వినిపిస్తోంది.

కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన అధికారుల్లో జయలక్ష్మీ సీబీఐకి వెళితే.. అమిత్ గార్గ్ ఎన్ పీఏకు..నవదీప్ సింగ్ రల్వే డీజీగా.. ద్వారకా తిరుమలరావులు వెళ్లిపోగా.. తాజాగా త్రివిక్రమ్ వర్మ.. మహేశ్ చంద్ర లడ్డాలు వెళ్లిపోయేందుకు రెఢీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

కారణాలు ఏమైనా.. ఉండాల్సిన దాని కంటే చాలా తక్కువగా ఏపీలో ఐపీఎస్ అధికారులు ఉండటం ఇబ్బందికరంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ కేంద్రానికి ఒక లేఖ రాస్తూ.. ఏపీలో నెలకొన్న ఐపీఎస్ ల కొరత తీర్చాల్సిందిగా కోరుతుండటం గమనార్హం. మరి.. దీనికి కేంద్రం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.