మేం వ‌స్తే ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దే: అమిత్ షా

బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఇక్క‌డే ఉన్న ఆయ‌న‌.. శ‌నివారం ఉద‌యం మీడియాతో మాట్లాడారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే 4శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

వ‌రికివెయ్యి బోన‌స్‌

బీజేపీకి అవకాశమిస్తే వరి పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామని రైతులను ఉద్దేశించి అమిత్ షా చెప్పారు. సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా అమిత్ షా మార్చార‌ని విమ‌ర్శించారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరటం ఖాయమని చెప్పారు.

తాము అధికారంలోకి వ‌స్తే.. తొలి కేబినెట్ స‌మావేశంలోనే పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా చెప్పారు. కేసీఆర్ హాయాంలో యువత సహా.. అన్ని వర్గాలు నిరాశలో ఉన్నాయన్నారు. పాస్‌పోర్ట్, మియాపూర్ భూములు, ఔటర్ రింగ్ రోడ్, గ్రానైట్, మనీ లాండరింగ్.. కేసీఆర్ సర్కార్ అవినీతి మయమయ్యాయన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకాలు వస్తున్నాయని విమ‌ర్శించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని ముఖ్య‌మంత్రిని చేస్తామ‌న్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ మాట తప్పారన్నారు. రూ.3,116 నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని అమిత్ షా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా మాదిగ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందని అమిత్ షా పేర్కొన్నారు.

ఫాంహౌస్‌లో కాదు‌ ..

ఫాంహౌస్‌లో కాదు‌ .. ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండాలని కేసీఆర్‌పై ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి అవినీతి పరులను జైలుకు పంపుతామని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామని తెలిపారు. ఎంఐఎం వలనే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదన్నారు.