ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ ఎందుకు ఆగింది? తప్పు ఎవరిది?

ఏపీలోని పేదలకు జగన్ సర్కారు ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి భారీ కసరత్తు జరిపారు. ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ముహుర్తాల్ని డిసైడ్ చేశారు. అనూహ్యంగా ఒకటి తర్వాత ఒకటిగా పెడుతున్న ముహుర్తాలు వాయిదాలు పడుతున్నాయి. కోర్టు అభ్యంతరాలు పెడుతున్నాయి. ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. మరి.. ఈ ఉదంతంపై ఆంధ్రజ్యోతి ఎండీ కమ్ సీనియర్ రిపోర్టర్ ఆర్కే తన వీకెండ్ కామెంట్ లో క్లియర్ గా తన వాదనను పేర్కొన్నారు. ఆయన మాటల్ని యథాతధంగా తీసుకుంటే..

“పేదలకు ఇళ్ల స్థలాల విషయమే తీసుకుందాం. ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడడానికి నిజంగా ప్రతిపక్షాలు కారణమా? అంటే కానే కాదు! ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే న్యాయస్థానాలలో ఆటంకాలు ఎదురవుతున్నాయని స్పష్టమవుతున్నది. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో జరిగిన అవినీతిని పక్కనపెడితే లబ్ధిదారులు తమకు లభించిన స్థలాలను అయిదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వాలని జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లో ఉన్న అసైన్‌మెంట్‌ చట్టానికి విరుద్ధం. ఈ కారణంగానే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది”.

“కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వాలు తమకు కేటాయించే ఇళ్ల స్థలాలను అమాయకంగా అమ్ముకుని మళ్లీ ఇళ్లు లేని పేదలుగా మిగలకూడదన్న ఉద్దేశంతో వాటిని అమ్ముకోవడాన్ని నిషేధిస్తూ 1977లో ఉమ్మడి రాష్ట్రంలోనే అసైన్‌మెంట్‌ చట్టం తెచ్చారు. ఈ చట్టం పరిధిలో గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను డీకేటీ పట్టాల రూపంలో ఇచ్చేవి. ఈ విధానం గతంలో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు! ఇప్పుడు మాత్రం ఎందుకు వివాదం అయిందంటే, అమల్లో ఉన్న చట్టానికి విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కారణం. ఈ వాస్తవాన్ని విస్మరించి ప్రతిపక్షాలను, న్యాయస్థానాలను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి?”.

“ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా డీడ్స్‌ ఇవ్వడాన్ని చట్టం అనుమతించదని అధికారులు చెప్పినా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వినిపించుకోలేదు. లబ్ధిదారుల నుంచి పది రూపాయల ఫీజు తీసుకొని కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ చేయడానికి వీలుగా 44వ నంబర్‌ జీవో జారీ చేశారు. ఈ జీవోకు చట్టబద్ధత లేదని హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం వివాదం సుప్రీంకోర్టులో ఉంది”

“1977నాటి అసైన్‌మెంట్‌ చట్టం అమల్లో ఉండగా సుప్రీంకోర్టు మాత్రం 44వ నంబర్‌ జీవోను ఎలా సమర్థిస్తుంది? చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది జనవరిలో అసైన్‌మెంట్‌ చట్టానికి సవరణ చేసింది. దీని ప్రకారం 20 ఏళ్ల తర్వాత మాత్రమే అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ రూల్స్‌ ప్రకారం చూసినా ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడం చట్ట విరుద్ధం అవుతుంది”

“జగన్‌ కోరుకుంటున్నట్టు కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ చేయాలంటే అసైన్‌మెంట్‌ చట్టాన్ని మళ్లీ సవరించాలి. అయితే సదరు సవరణలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర అసైన్‌మెంట్‌ చట్టానికి విరుద్ధంగా ఉండే సవరణలను కేంద్ర ప్రభుత్వం సహజంగానే తిరస్కరిస్తుంది”

“పేదలు కూడా ఐదేళ్ల తర్వాత తమకు కేటాయించిన స్థలాలను అమ్ముకోవడానికి వీలుగా పట్టాలు ఇవ్వాలని కోరడం లేదు. దీన్నిబట్టి తప్పెవరిది? ప్రతిపక్షాలదా? ప్రభుత్వానిదా? అసైన్డ్‌ భూములను కొనుక్కోవడం కూడా చట్ట విరుద్ధమే. పులివెందుల సమీపంలో తమ కుటుంబం చట్టం తెలియని కారణంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిందని ఒకప్పుడు దివంగత రాజశేఖర్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విచారం వ్యక్తంచేశారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అసైన్డ్‌ భూములు సేకరించిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్‌ అండ్‌ కో విమర్శించింది”

ఈ వాదన మొత్తం విన్నప్పుడు ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం ఎందుకు ఆగింది? అదెప్పటికైనా అమలు అవుతుందా? అన్న సందేహం కలుగక మానదు. ఇందుకు భిన్నంగా వినిపిస్తున్న వాదన సంగతేమిటి? అన్నది అసలు ప్రశ్న.