‘నీ ఎన్నిక‌ల గుర్తు కంటే.. నువ్వే అందంగా ఉన్నావ్‌!’

మ‌హిళ‌ల‌పై భౌతిక దాడులేకాదు.. మాన‌సిక దాడులు కూడా కొన‌సాగుతున్నాయ‌నేందుకు.. ఇదే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఒక‌వైపు మ‌హిళ‌ల‌కు రాజ‌కీయాల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. దేశం ముందుకు సాగు తుంటే.. మ‌రోవైపు వారిని అవ‌మానించే క్ర‌తువులు ఇంకా కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి.. ప్ర‌జ‌ల మ‌ధ్య జై కొట్టించుకుని చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగు పెట్టాల‌ని భావిస్తున్న‌వారి విష‌యంలోనే అవ‌మానాలు.. ఎదురవుతున్నాయి.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల కురుక్షేత్రంలోకి దిగిన మ‌హిళా అభ్య‌ర్థి విష‌యంలో అత్యంత జాగ్ర త్తగా వ్య‌వ‌హ‌రించాల్సిన రిట‌ర్నింగ్ అధికారి(ఆర్.వో) అత్యంత అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌స్తుతం తీవ్ర వివాదంగా మారింది. ఓ స్వ‌తంత్ర మ‌హిళా అభ్య‌ర్థిని ప‌ట్టుకుని.. ఆర్వో.. ‘నీ ఎన్నిక‌ల గుర్తుక‌న్నా.. నువ్వే అందంగా ఉన్నావ్‌.. నీ ఫొటో చూసి ఓటేస్తారులే వెళ్లు’ అని వ్యాఖ్యానించ‌డం.. తీవ్ర వివాదం సృష్టించింది.

ఎక్క‌డ‌.. ఏం జ‌రిగింది?

ఈ నెల 30న పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈవీఎంలలో గుర్తుల కేటాయింపును పరిశీలించేందుకు కామారెడ్డి నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న మంగ‌లిప‌ల్లి భార్గ‌వి.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రానికి వెళ్లారు. అయితే.. ఈవీఎంలపై ముద్రించిన గుర్తులను చూసి అభ్యంతరం తెలిపారు. బీజేపీ, బీఎస్పీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల గుర్తులను మాత్రమే చాలా స్పష్టంగా ముద్రించారని, మిగతా అభ్యర్థుల గుర్తులు రంగు వెలిసిపోయి అస్పష్టంగా ఉన్నాయని ఆరోపించారు.

ముఖ్యంగా స్వ‌తంత్ర అభ్య‌ర్థి అయిన తనకు కేటాయించిన ‘బేబీ వాకర్‌’ గుర్తును సరిగా ముద్రించలేదని.. అది రెండు కర్రలను నిలబెట్టినట్లుగా ఉందని, అసలు ఏ కోణంలోనూ ‘బేబీ వాకర్‌’లా లేదని అభ్యంతరం తెలిపారు. ఈ విష‌యాన్నే ఆర్‌వో శ్రీనివాస్‌రెడ్డిని ప్రశ్నించారు. గుర్తులు స్పష్టంగా లేకుంటే వృద్ధులు ఓటు ఎలా వేస్తారని నిలదీశారు. ఈ క్రమంలో ఆర్‌వో మాట్లాడుతూ.. ‘ఈవీఎంపై మీకు కేటాయించిన గుర్తు కంటే నీ ఫొటో బాగుంది.. అందంగా ఉన్నావ్‌. నీ గుర్తును చూసి ఓటు వేయరు..నీ ఫొటోను చూసి ఓట్లు వేస్తారు’ అని వ్యాఖ్యానించాడు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.