ఇంకోసారి ఇలా మాట్లాడితే పార్టీనే ర‌ద్దు చేస్తాం: ఈసీ ఫైర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిప్పులు చెరిగింది. ఇలా ఇంకోసారి మాట్లాడితే.. చ‌ర్య‌లు త‌ప్ప‌వు. అవ‌స‌ర‌మైతే.. పార్టీని సైతం ర‌ద్దు చేస్తాం! అంటూ.. ఆగ్ర హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం పొద్దు పోయాక‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు లేఖ అందింది. ఈ లేఖ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించింది.

“మీరు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు. ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ఎలా చేయాలో తెలియ‌దా? మీకు ఎవ‌రైనా వ‌చ్చి చెప్పాలా?” అంటూ.. కేసీఆర్‌ను ఎన్నిక‌ల సంఘం ప్ర‌శ్నించింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించింది. ప్ర‌తిప‌క్షాల‌ను జంతువుల‌తో పోల్చ‌డం.. దూష‌ణ‌ల‌కు దిగ‌డం ప్ర‌జాస్వామ్య రాజ‌కీయాల్లో స‌రికాద‌ని తేల్చి చెప్పింది. అంతేకాదు. ఇక‌పై ఎలాంటి ఫిర్యాదు వ‌చ్చినా.. తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని హెచ్చ‌రించింది.

ఏం జ‌రిగింది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. రోజుకు రెండు నుంచి నాలుగు జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షాల‌పై ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు. ఇలా.. అక్టోబ‌రు 30న బాన్సువాడ‌లో బీఆర్ఎస్ నాయ‌కులు నిర్వ‌హించిన ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ స‌హా ఆ పార్టీ నాయ‌కుల పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాంగ్రెస్ నాయ‌కుల‌ను కుక్క‌ల‌తో పోలుస్తూ.. విమ‌ర్శ‌లు చేశారు. వారిని ద‌గాకోరులంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు వారిని త‌రిమి కొట్టాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ఈ వ్యాఖ్య‌లు చేశారంటూ కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ రికార్డుల‌తో స‌హా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నిక‌ల సంఘం .. క్షేత్ర‌స్థాయిలో క‌లెక్ట‌ర్, ఎస్పీ ద్వారా.. వివ‌రాలు తెప్పించుకుని ప‌రిశీలించింది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌ను హెచ్చ‌రిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది.