కాంగ్రెసోళ్లూ.. న‌న్నే సీఎంగా కోరుతున్న‌రు: కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసిన బీఆర్ ఎస్ అధినేత‌,సీఎం కేసీఆర్‌.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రేవంత్ ను సీఎం అభ్య‌ర్థిగా పేర్కొంటూ వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఉటంకించారు. “ఇల్లు అల‌గ్గానే పండ‌గ అయినట్టా.. మీరు చెప్పుర్రి! ఇదిగో గీడ రేవంత్ రెడ్డి సీఎం ముచ్చ‌ట కూడా అంతే. అస‌లు కాంగ్రెసోళ్లు కూడా న‌న్నే సీఎం కావాల‌ని కోరుతున్న‌రు” అని త‌నదైన శైలిలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌ విజయం ఖాయమని.. అందులో ఎలాంటి అనుమానం లేదని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. “నేను ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా. రైతుల బాధలు నాకు తెలుసు. కాంగ్రెస్‌ నేతలకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. రేవంత్ రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా? పొలం దున్నారా? అందుకే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి పెద్ద భూకబ్జాదారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారు. రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు. ఆయన టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్‌ తుపాకీ పట్టుకొని వెళ్లాడు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తుపాకి ప‌ట్టుకుని మ‌న ఉద్య‌మాన్ని బెదిరించినోనికి ఓటేస్త‌మా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌లో ముఖ్య‌మంత్రుల లొల్లి గురించి తెలుసుకోవాల్నంటే క‌ర్ణాట‌క రాజ‌కీయాలు చూడాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు. అక్క‌డ పూట‌కో సీఎం అభ్య‌ర్థి తెర‌మీద‌కి వ‌స్తాడ‌ని.. అభివృద్ది లేదు.. గిభివృద్ధి లేదు.. ఈ సీఎంల కొట్లాటే.. మ‌స్తు జ‌రుగుతోంది. ఇక్క‌డ కూడా ఆ లొల్లి కావాల్నా మ‌న‌కు! అని ప్ర‌శ్నించారు.

“రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లో చిత్తుగా ఓడించాలి. నేనే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్‌లో 15 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే కదా.. రేవంత్‌ సీఎం అయ్యేది. రేవంత్‌ సీఎం అవుతాడని ఓట్లేస్తే కొడంగల్‌ పరిస్థితి మళ్లీ మొదటికే. ప్రజలు ఇవన్నీ గమనించాలి. కొడంగల్‌లో పనిచేసే నరేందర్‌ రెడ్డి కావాలా? వట్టిమాటలు చెప్పే రేవంత్‌ రెడ్డి కావాలా? ప్రజలే తేల్చుకోవాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.