అంకెలు.. సంఖ్య‌లు త‌గ్గుతున్నాయే.. కాంగ్రెస్ గుస‌గుస‌!!

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందు 110.. నోటిఫికేష‌న్ వ‌చ్చాక 100.. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ స‌మ‌యానికి 90 నుంచి 100 మధ్యలో.. ప్ర‌చారం ప్రారంభించాక‌.. 90.. ఇప్పుడు 80- ఇదీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల లెక్క‌!! ఇదెవ‌రో చెప్పిన మాట కాదు.. స్వ‌యంగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి నుంచి సీనియ‌ర్ నాయ‌కులు త‌డ‌వ‌కోసారి చెబుతున్న అంకెలు.. సంఖ్య‌లు!! ఇప్పుడు ఈవిష‌య‌మే కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ చ‌ర్చ‌గా మారింది. కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ ఇచ్చామ‌ని చెబుతూ.. అధికారంలోకి వ‌చ్చేందుకు ఉత్సాహంగా క‌దులుతున్న కాంగ్రెస్‌లో ఈ సంఖ్య‌లు, అంకెలు మారుతుండ‌డం ఒక‌ర‌క‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది.

“కేసీఆర్ బొంద పెట్టేందుకు.. తెలంగాణ స‌మాజం రెడీగా ఉంది. మాకు 119కి 110 స్థానాల్లో విజ‌యం ఖాయం” అంటూ.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందు.. నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో రేవంత్‌రెడ్డి చెప్పిన మాట‌. అయితే.. త‌ర్వాత ఆయ‌న ఈ సంఖ్య‌ను మ‌ళ్లీ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. ప‌ది ప‌ది స్థానాలు త‌గ్గుతూ.. వ‌చ్చి.. ఇప్పుడు ఏకంగా 80 అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. ఇది ఒక‌ర‌కంగా కాంగ్రెస్ ను ఇర‌కాటంలోకి నెట్ట‌డ‌మే అవుతుంద‌నేది సీనియ‌ర్ల వాద‌న‌. పోటీ తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలోనూ కాంగ్రెస్ నాయ‌కులు ఆత్మ‌బ‌లంతో ముందుకు సాగుతున్నార‌నేది సీనియ‌ర్లు చెబుతున్నారు.

అయితే.. అనూహ్యంగా బ‌హిరంగ వేదిక‌ల‌పై ఇలా సంఖ్య‌లు-అంకెలు త‌గ్గించుకుంటూ పోతే.. కేడ‌ర్‌లో నిస్స‌త్తువ వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. “గెలుచుడా ఓడుడా.. ప‌క్క‌న పెట్టు. అస‌లు ఈ లెక్క‌లెందుకు? ఏదో ఒక మాట‌పై ఉంటే పోలా. ఒక‌రు 100 అంటురు. మ‌రొక‌రు 90 అంటురు.. ఎందుకీ గింజులాట‌. అనేదేదో.. ఒక్క‌పాలే అన‌రాదా!” ఇదీ.. హ‌నుమంత‌రావు(వీహెచ్‌) తాజాగా చేసిన వ్యాఖ్య‌. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సీఎం సీటుపై జ‌రిగిన రాజ‌కీయ పంచాయ‌తీని కూడా ఆయ‌న ఇలానే త‌ప్పుబ‌ట్టారు. ఇప్పుడు అంకెలు, సంఖ్య‌లు త‌గ్గుతుండ‌డంపైనా ఇలానే గుర్రుగా ఉన్నారు.

ఇక‌, తాజాగా నిజ‌మాబాద్ జిల్లా ద‌ర్ప‌ల్లిలో మాట్టాడిన రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్ రాసిపెట్టుకో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 3వ తేదీన లెక్క చూసుకో కేసీఆర్.. 80 కంటే ఒక్కటి తక్కువున్నా ఏ చర్యకైనా సిద్ధం. కేసీఆర్‌కు పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఇక్కడ పోడు భూముల సమస్య తీరలేదు. గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తీరుస్తానని పదేళ్లయినా తెరువలేదు. అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల క‌న్నా.. ఆయ‌న చెప్పిన సంఖ్య‌లే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి. దీనిపైనే కాంగ్రెస్ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రి వ‌చ్చే నాలుగురోజుల్లో అయినా.. ఈ సంఖ్య‌ను త‌గ్గించ‌కుండా ఉంటే బాగుంటుంద‌ని అంటున్నారు.