కాంగ్రెస్ దే అధికారమా ? లోక్ పోల్ జోస్యం

తొందరలో జరగబోతున్న తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం ఖాయమేనా ? తాజాగా వెల్లడైన లోక్ పోల్ సర్వే ఇదే విషయాన్ని చెబుతోంది. 46 శాతం ఓటింగ్ షేరుతో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని సర్వేలో బయటపడిందట. కాంగ్రెస్ కు 69-72 సీట్లు ఖాయంగా వస్తాయని సర్వే చెప్పింది. బీఆర్ఎస్ 35-39 సీట్ల మధ్యే పరిమితమవుతుందని తేలింది. బీఆర్ఎస్ 40 సీట్లు తెచ్చుకోవటం కూడా కష్టమేనని సర్వేలో తేలినట్లు లోక్ పోల్ చెప్పింది.

అధికారంలోకి రావటం ఖాయమని చెప్పుకుంటున్న బీజీపీకి 3 నియోజకవర్గాల్లో గెలిస్తే ఎక్కువని, ఎంఐఎం 6 స్ధానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పింది. కాంగ్రెస్ కు 43-46 శాతం ఓట్లు వస్తాయని, బీఆర్ఎస్ కు 38-41 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఓట్ల శాతం 41గా చూపిస్తున్నా ఆ మేరకు సీట్లయితే గెలుచుకునే అవకాశం లేదని లెక్క తేలిందట. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 46.78 శాతం ఓట్లొచ్చింది. అదిపుడు సుమారు 6 శాతం తగ్గిపోతోందని తేలిందట.

పోయిన ఎన్నికల్లో 28.43 ఓట్ల శాతానికి మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ ఇపుడు గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకుని 46 దాకా తెచ్చుకుంటుందని సర్వేలో తేలిందట. బీజేపీకి పోయిన ఎన్నికల్లో వచ్చినట్లుగానే ఓట్ల శాతం కాస్త అటు ఇటుగా 7-8 మధ్య ఉంటుందని తేలింది. ఇక్కడ సమస్య ఏమిటంటే బీజేపీకి పడే ఓట్లు హార్డ్ కోర్ ఓట్లు మినహా మిగిలిన ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్ళబోతున్నట్లు తేలిందని చెప్పింది.

ఈ ఏడాది మేనెలలో జరిగిన కర్నాటక ఎన్నికల్లో కూడా లోక్ పోల్ చేసిన సర్వే నిజమైంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 134 సీట్లు గ్యారెంటీగా వస్తాయని సర్వేలో చెబితే అన్నే సీట్లు వచ్చాయి. బీజేపీ 65 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసినట్లుగానే అన్నే సీట్లకు పరిమితమైంది. ఇపుడు తెలంగాణా ఎన్నికల ముందు కూడా లోక్ పోల్ 72 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పదిరోజుల ముందు ప్రకటించటం సంచలనంగా మారింది. మరి లోక్ పోల్ సర్వే ఎంతవరకు నిజమవుతుందన్నది డిసెంబర్ 3వ తేదీన తేలిపోతుంది.