మొదలవ్వబోతున్న యాత్రల జోరు

తెలుగుదేశంపార్టీలో మళ్ళీ యాత్రల జోరు మొదలవ్వబోతోంది. ఈ యాత్రలు జోరు కూడా ఈనెలలోనే మొదలయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. చంద్రబాబునాయుడుకు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వటమే కాకుండా ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో రెట్టించిన ఉత్సాహం కనబడుతోంది. మెడికల్ గ్రౌండ్స్ తో  మధ్యంతర బెయిల్ స్ధానంలో పూర్తిస్ధాయి రెగ్యులర్ బెయిల్ దొరకటం చంద్రబాబు అండ్ కో కు పెద్ద రిలీఫనే చెప్పాలి. ఇదే సమయంలో జడ్జిచేసిన కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబుతో పాటు పార్టీకి బిగ్ బూస్టప్ ఇచ్చినట్లే.

ఇంతకీ జడ్జి ఏమన్నారంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్రకు తగిన ఆధారాలు లేవన్నారు. అలాగే స్కామ్ లో డబ్బులు పార్టీ ఖాతాలో పడినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అవినీతిని నిరూపించటంలో  సీఐడీ ఫెయిలైందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు కచ్చితంగా చంద్రబాబుకు పెద్ద ప్లస్ పాయింటనే చెప్పాలి. అందుకనే జడ్జి వ్యాఖ్యలను ఆధారాలుగా చేసుకుని లోకేష్ ఈనెల 24వ తేదీనుండి యువగళం పాదయాత్రను మళ్ళీ ప్రారంభించబోతున్నరట.

అలాగే భువనేశ్వరి కూడా 26వ తేదీనుండి నిజంగెలిచింది అనే స్లోగన్ తో బస్సుయాత్రను పునఃప్రారంభించబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు నిజంగెలవాలి అని భువనేశ్వరి నాలుగైదు నియోజకవర్గాల్లో యాత్రచేసిన విషయం తెలిసిందే. ఇపుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి చంద్రబాబుకు కేసులో  క్లీన్  సర్టిఫికేట్ వచ్చినట్లుగా భువనేశ్వరి చెప్పబోతున్నారట. తన యాత్రను విశాఖపట్నం నుండి మొదలు పెట్టబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

అలాగే డిసెంబర్లో చంద్రబాబు కూడా జనాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారట. భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్రలో ఉన్నపుడే నంద్యాలలో చంద్రబాబు అరెస్టయ్యారు. కాబట్టి అదే యాత్రను నంద్యాలలోనే మళ్ళీ మొదలుపెట్టే అవకాశాలున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. ఏదేమైనా వీళ్ళు చేయబోయే యాత్రల్లో ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటారనటంలో సందేహంలేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావటం వ్యక్తిగతంగా చంద్రబాబుతో పాటు టీడీపీకి కూడా పెద్ద బూస్టపనే చెప్పాలి. యాత్రలు మొదలైతే కానీ జనాల స్పందన ఏమిటో తెలీదు.