కాంగ్రెస్ పాలన బాగుంటే టీడీపీ పుట్టేదా?:కేసీఆర్

ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులే గడువున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార దూకుడు పెంచారు. మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డ కేసీఆర్…టీడీపీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన బాగుంటే టిడిపి ఎందుకు పుట్టేదని కేసీఆర్ ప్రశ్నించారు. 50 ఏళ్ళు పాలన చేసిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో అందరూ ఆలోచించాలని అన్నారు.

తెలంగాణకు గతంలో నష్టం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీ అని, బలవంతంగా తీసుకువెళ్లి ఆంధ్రాలో కలిపేశారని కేసీఆర్ ఆరోపించారు. ఇక, 2004లో తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని, ఆనాడు భీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సాధన కోసమే ఆనాడు టీఆర్ఎస్ పుట్టిందని, కొట్లాడి ప్రత్యేక తెలంగాణను సాధించుకుందని గుర్తు చేశారు. ఇక, కరీంనగర్ తో తనకు ప్రత్యేకంగా అనుబంధం ఉందని, ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కేసీఆర్ అన్నారు.

అందుకే ఇక్కడి నుంచి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఆటోలకు ఫిట్నెస్ చార్జీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులు కాలుష్యంలో గడుపుతుండటం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయని, అందుకే వారికి దేశంలో ఎక్కడా లేనివిధంగా వేతనంలో 30% అలవెన్స్ ఇస్తున్నామని చెప్పారు. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని అన్నారను. ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ప్రజలు ఓటు వేయాలని, అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని కూడా చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.