ప్ర‌జానాడిని ముందే ప‌ట్టేసిన జ‌గ‌న్‌…?

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాల గ‌డువు ఉంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కానుంది. అయితే.. అప్పుటికి ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంటుంది? ఎవ‌రివైపు మొగ్గు చూపుతారు? అనే విష‌యాలు ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. స‌హ‌జంగా ఇదే అభిప్రాయం విశ్లేష‌కుల‌కు కూడా ఉంటుంది. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ మాత్రం ప్ర‌జానాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌లు ఎటు వైపు మొగ్గు చూపుతారు? ఎలాంటి ఫ‌లితం ఇవ్వాల‌ని అనుకుంటారు? అనే విష‌యాల‌పై ఆయ‌న స్ప‌ష్ట‌త‌తో ఉన్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ముందు జాగ్ర‌త్త‌గా త‌న దారిలో తాను ప‌య‌నిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడు వ్యూహాల‌ను జ‌గ‌న్ అనుసరిస్తున్న‌ట్టుచెబుతున్నారు. ఒక‌టి సెంటిమెంటు. రెండు.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం.. మూడు ఓట‌ర్ల జాబితాపై త‌న‌దైన ముద్ర వేయ‌డం. అని ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. తొలి విష‌యాన్ని తీసుకుంటే.. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ ఎక్క‌డ ప్ర‌సంగించినా.. మీ ఇంట్లో మంచి జ‌రిగింద‌ని అనుకుంటే.. అంటూ సెంటిమెంటును ప్ర‌జ‌ల‌పై రుద్ద‌తున్న విష‌యం తెలిసిందే. అమ్మ ఒడి నుంచి రైతు భ‌రోసా.. చేదోడు, డ్వాక్రారుణాలు.. ఇలా అనేక ప‌థ‌కాల‌ను ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతున్నారు.

సో.. వీటిలో ఏదో ఒక‌టి ప్ర‌తి కుటుంబానికీ అందుతోంది. దీంతో ఆయా వ‌ర్గాల‌ను త‌న‌వైపు ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం ఆయ‌న చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇక‌, రెండో అంశం.. విప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డం. ఇది కూడా చంద్ర‌బాబును జైల్లో పెట్ట‌డం, విప‌క్ష నాయ‌కుల‌పై కేసులు పెట్ట‌డం వంటివాటిని గ‌మ‌నిస్తే.. తెలుస్తుంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఫ‌లితంగా కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు.. వారి వాయిస్ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకునే కార్య‌క్ర‌మేన‌ని చెబుతున్నారు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ వ్య‌తిర‌క‌త మ‌రింత పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌నేది పరిశీల‌కుల మాట‌.

ఇక‌, మూడో అంశం ఓట‌ర్ల జాబితాను ప్ర‌భావితం చేయ‌డం. ఈ క్ర‌మంలో డోర్ నెంబ‌ర్లు లేని.. మృతి చెందిన వారి ఓట్లు కూడా.. టార్గెట్ అవుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల ఓట‌ర్ల ముసాయిదా జాబితాలో ఇలాంటి వారి ఓట్లే ఎక్కువ‌గా ఉన్నాయి. అదేస‌మ‌యంలో టీడీపీ సానుభూతిప‌రులు అన్న‌వారి ఓట్లు గ‌ల్లంత‌య్యాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు విమ‌ర్శించారు. అయితే.. ఇదంతా కూడా.. చాలా వ్యూహాత్మ‌కంగా జ‌రుగుతున్న‌దేన‌ని.. ప్ర‌జానాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన సీఎం జ‌గ‌న్‌… త‌న‌దైన శైలిలో అనుకూల‌త‌ను పెంచుకునే చ‌ర్య‌లు ప్రారంభించార‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని విప‌క్షాలు, ప్ర‌జ‌లు గ్ర‌హించ‌లేక పోతున్నార‌నేది వారి వాద‌న‌.