ఆచరణ సాధ్యంకాని హామీలతో నాశనమేనా ?

రాష్ట్రం ఎలాగపోయినా పర్వాలేదు తాము అధికారంలోకి రావటమే టార్గెట్టుగా పెట్టుకున్నాయి పార్టీలు. అందుకనే ఆచరణసాధ్యంకాని హామీలను ఇచ్చేస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఎలా అమలుచేస్తారని నిలదీస్తే ఏవో కాకమ్మ కథలు చెబుతాయి. ఖర్చలు తగ్గించుకుంటామని, నిధుల దుబారాను అరికడతామని, పథకాల అమలులో అనర్హులను ఏరివేస్తే కావాల్సినన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని అంటాయి. అలా మిగిలిన నిధులతో తాము ప్రకటించిన హామీలను ఈజీగా అమలుచేయచ్చని నమ్మబలుకుతాయి.

సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు చెప్పిన మాటలేవీ గుర్తుండవు. తామిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాయి. దాంతో ప్రభుత్వ ఆర్ధికపరిస్దితి తల్లకిందులైపోతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే కాంగ్రెస్ మ్యానిఫెస్టో చూస్తే అలాగే అనిపిస్తోంది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుచేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడెక్కడి డబ్బు సరిపోదు. అయినా సరే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రం మ్యానిఫెస్టో అమలుకు తమ దగ్గర మంత్రదండం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు.

మ్యానిఫెస్టోలో కీలకమైనవి ఏమిటంటే రైతులకు రు. 2 లక్షలు మాఫీచేస్తారట. రు. 3 లక్షలు వడ్డీలేని రుణాలిస్తారట. వివాహం చేసుకునే అమ్మాయికి పెళ్ళి సమయంలో తులం బంగారం+లక్ష రూపాయల సాయం చేస్తారట. అమరుల కుటుంబాలకు ఉద్యోగం, నెలకు రు. 25 వేల పెన్షన్, ఇంటి స్ధలం ఇస్తారట. అన్నీ బెల్ట్ షాపులను రద్దుచేస్తారట. మెగా డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న 6 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తారట. విద్యారంగం బడ్జెట్ ను 6 శాతం నుండి 15 శాతానికి పెంచుతారట.

ఇలాంటి ఆర్ధిక సంబంధమైన హామీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి ఏమిటనే ఆలోచనతో ఏమాత్రం సంబంధంలేకుండా కాంగ్రెస్ హామీలిచ్చేసింది. మ్యానిఫెస్టోను చూసిన తర్వాత అధికారంలోకి వస్తే చాలు మిగిలిన విషయాలు మళ్ళీ చూసుకోవచ్చని అనుకున్నట్లే ఉంది. 2014, 2018లో ఇచ్చిన హామీలను అమలుచేయలేకే కేసీయార్ తల్లకిందులవుతున్నారు. అలాంటిది కేసీయార్ హామీలకు మించి కాంగ్రెస్ హామీలిచ్చేసింది. ఇలాంటి ఆచరణసాధ్యంకాని హామీలతోనే రాష్ట్రాల అభివృద్ధి నాశనమైపోతున్నాయి.