చంద్ర‌బాబు రెండోసారి సీఎం ఎలా అయ్యారో చెప్పిన జ‌గ‌న్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉమ్మ‌డి ఏపీకి రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా చేశారు. త‌ర్వాత విభ‌జిత ఆంధ్రప్రదేశ్‌కు 2014లో ముఖ్య‌మంత్రి అయ్యారు. అయితే.. ఈ మూడు సార్లు బాబు ఎలా ముఖ్య‌మంత్రి అయ్యారో.. తాజాగా ఏపీ సీఎం, వైసీపీఅధినేత జ‌గ‌న్ వివ‌రించారు. ముఖ్యంగా రెండోసారి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావ‌డానికి కార‌ణాలు వెల్ల‌డించారు. తాజాగా సీఎం జ‌గ‌న్ ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా అసైన్డ్ భూముల‌కు ప‌ట్టాలిచ్చే కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు.

అనంతరం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు 1996లో తొలిసారి త‌న మామ నుంచి అధికారం లాక్కొని ముఖ్య‌మంత్రి అయ్యార‌ని అన్నారు. అప్ప‌ట్లో ప్ర‌జలు ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా గెలిపించ‌లేద‌ని.. ఎన్టీఆర్‌ను ముఖ్య‌మంత్రిగా గెలిపించార‌ని తెలిపారు. అయితే.. మ‌ధ్య‌లో పార్టీలో జోక్యం చేసుకుని చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యార‌ని చెప్పారు. ఇక‌, రెండోసారి అనూహ్యంగా చంద్ర‌బాబు సీఎం అయ్యార‌ని తెలిపారు.

2000 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కార్గిల్ యుద్ధం వెనుక త‌న పాత్ర ఉంద‌ని.. దేశాన్ని కూడా న‌డిపించ‌గ‌ల స‌త్తా త‌న‌కుంద‌ని ప్ర‌చారం చేయించుకుని ముఖ్య‌మంత్రి అయ్యార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇక‌, 2014లో ప్ర‌జ‌ల‌కు ఇంద్ర‌లోకాన్ని చూపించి మూడోసారి ముఖ్య‌మంత్రి అయ్యార‌ని అన్నారు. అయితే.. ఆయ‌న చూపించిన ఇంద్ర‌లోకం ఎఫెక్ట్ 2019లో గూబ‌గుయ్యిమ‌నేలా చేసింద‌ని విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు హ‌యాంలో పేద‌లు ఆయ‌న‌కు క‌నిపించ‌లేద‌ని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని అన్నారు. ఈ మోసాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. త‌న పాల‌న‌లో ప్ర‌తి కుటుంబానికి ఏదో ఒక రూపంలో మేలు జ‌రిగింద‌ని.. ఇలా జ‌రిగింద‌ని అనుకుంటేనే త‌న‌ను గెలిపించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.