ఒకే పేరు.. అభ్యర్థులు వేరు

ఎన్నికల్లో విజయం కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అభ్యర్థులు సాగుతున్నారు. అన్ని పార్టీల నాయకులు విజయం కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల్లో తమ గెలుపునకు అడ్డు వచ్చే సమస్యలను పరిష్కరించుకుంటూ సాగుతున్నారు. అయితే నామినేషన్ల ఉప సంహరణ ముగిసి, అభ్యర్థుల లెక్క తేలడంతో కొంతమంది అభ్యర్థులకు ఇప్పుడు మరో తలనొప్పి మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేస్తుండటమే అందుకు కారణం.

ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ఠి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరోసారి ఎన్నికల సమరానికి సై అంటున్నారు. అయితే ఎమ్.గోపాల్ పేరుతోనే ఉన్న మరో అభ్యర్థి ఏఐహెచ్ సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సనత్ నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ అదే పేరుతో ఉన్న ఉప్పలపాటి శ్రీనివాస్ యుగ తులసి పార్టీ నుంచి నిలబడ్డారు. ఇక గోషామహల్ లో నందకిషోర్ వ్యాస్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అక్కడ శుభం వ్యాస్, సందీప్ వ్యాస్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమయ్యారు.

మహేశ్వరంలో బీఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పోటీగా మద్ది సబిత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. నిర్మల్ లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి పోటీగా మంతెన ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్కు పోటీగా కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే తమ అభ్యర్థికి ఓట్లు పడకుండా చేసేందుకు ఇలా అదే పేరుతో ఉన్న వ్యక్తులను స్వతంత్రులుగా పోటీ చేసేలా ప్రత్యర్థి పార్టీలు కుట్ర పన్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.