వయసు 70 పైనే.. అయినా పోటీకి సై

ఆ నాయకులందరూ రాజకీయాల్లో ఎంతో సీనియర్లు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా చాలా పదవులు అనుభవించారు. పార్టీలోనూ కీలక నేతలుగా ఎదిగారు. ఇప్పుడు 70 ఏళ్లు దాటినా చివరి అవకాశంగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయ మత్తు అంత సులభంగా వదలదని చెబుతుంటారు. ఇప్పుడు ఈ వయసులోనూ ఎన్నికల సమరానికి సై అంటున్న వీళ్లను చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది.

పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ లో ప్రస్తుతం సీనియర్ నాయకుడు. 2019 నుంచి స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే బాన్సువాడ నుంచి ఆరు సార్లు గెలుపొందారు. మూడు సార్లు మంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు ఆయన వయస్సు 74 ఏళ్లు. ఈ సారి ఎన్నికల బరి నుంచి తప్పుకుని తన తనయుడిని పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ మరోసారి బాన్సువాడ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ కోరడంతో శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డారు. మరో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి. ఆయన వయసు 74 ఏళ్లు. ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండు పర్యాయాలు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నిర్మల్ నుంచి బరిలో దిగారు.

ఇక కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వనమా వెంకటేశ్వర రావు వయసు 79 ఏళ్లు. ఆయన ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. ఈ సారి తన తనయుడు రాఘవను నిలబెట్టాలని అనుకున్నా.. ఓ కేసులో ఆయన జైలుకు వెళ్లి రావడంతో మరోసారి వెంకటేశ్వర రావే బరిలో నిలిచారు. మరోవైపు సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి వయసు 74 ఏళ్లు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన 71 ఏళ్ల రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారు.