వారి వ్యాపారాలు… పార్టీకి శాపమా

రాజకీయ పార్టీలకు ఫండ్ వ్యాపారవేత్తలు ఫండ్ ఇవ్వడం….బదులుగా ఆ వ్యాపారవేత్తలకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా పట్టం కట్టడం రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే, తమ పార్టీ విజయం సాధిస్తే ఫండ్ ఇచ్చిన వ్యాపారవేత్తల పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది.

ఎటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి వారి వారి వ్యాపారాలు కాపాడుకుంటూనే అడపాదడపా తమతమ నియోజకవర్గాల్లో కనిపిస్తే చాలు. ఒకవేళ తమ వ్యాపారాల్లో బిజీగా ఉండి పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గాల్లో కనిపించకపోయినా… ఎటూ గెలిచారు కాబట్టి పెద్దగా పోయేదేం ఉండదు. అలా కాకుండా, ఒక వేళ ఆయా వ్యాపార వేత్తలు పెట్టుబడి పెట్టిన పార్టీ అధికారంలోకి రాకపోతే మాత్రం ఆ వ్యాపారవేత్తలు గెలిచినా…ఓడినా కొన్ని ఇబ్బందులు తప్పవు.

ప్రస్తుతం ఏపీలోని కొందరు టీడీపీ నేతల మౌనం వెనుక వారి వారి వ్యాపారాలే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు టీడీపీ నేతలు తమ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం….టీడీపీలో ఉండి కూడా లేనట్లు వ్యవహరిస్తున్నారట. ఇక, మరి కొందరైతే ఏకంగా పార్టీ మారేందుకు కూడా రెడీ అయ్యారట.

దీంతో, వ్యాపారవేత్తలైన టీడీపీ నాయకులు మాకొద్దంటూ ఆయా నియోజవర్గాల టీడీపీ నేతలు చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారట. పార్టీలో ఉన్న అతి కొద్ది మంది ఎమ్మెల్యే, ఎంపీలలో కొందరు ఈ విధంగా ప్రవర్తించడంతో టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోందట.

ఈ నేపథ్యంలోనే వ్యాపారాలున్న నేతలు రాజకీయాలకు పనికొస్తారా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోందట. వ్యాపారాల వల్లే ఆ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారని, వ్యాపారాలు లేని, క్రియాశీలక రాజకీయాల్లో ఉండేవారిని నియోజవర్గాల ఇన్ చార్జిలుగా కేటాయించాలని తెలుగుతమ్ముళ్లు కోరుతున్నారట.ఏపీలో టీడీపీకి సంకట పరిస్థితి ఎదురైంది. తమ వ్యాపారలపై ఉన్న మక్కువతో కొందరు టీడీపీ నేతలు పార్టీని వీడకుండా…అటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా… పార్టీకి కొత్త చిక్కులు తెస్తున్నారట.

తమకున్న వ్యాపారల దృష్ట్యా తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయా నేతల ఇన్ డైరెక్ట్ గా చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. వారికి నచ్చజెప్పేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. మాజీ మంత్రి నారాయణ, పల్లె రఘునాధ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, గల్లా జయదేవ్ వంటి వారు మౌనం వహించడం వెనుక వారి వ్యాపారాలున్నాయట.

ఏపీ, తెలంగాణలో నారాయణ విద్యాసంస్థలున్నాయి. వ్యాపారపరంగా ప్రభుత్వం నుంచి కొన్ని ఇబ్బందులు మాజీ మంత్రి నారాయణకు ఎదురయ్యాయని, అందుకే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. మరో మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డికి కూడా అనంతపురం జిల్లాలో అనేక విద్యాసంస్థలున్నాయి.

అందుకే, 2019 ఎన్నికల తర్వాత పల్లె పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారట. ఇక, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తన వ్యాపారల నేపథ్యంలోనే అనధికారికంగా వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇక, అమర్ రాజా బ్యాటరీస్ అధినేత, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా తన వ్యాపారల నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే వ్యాపారాలు లేని వారినే నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులుగా ప్రకటించాలని చంద్రబాబుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారట. చాలామంది వ్యాపారవేత్తలు కమ్ టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కన్నా వ్యాపారాలపైనే ఫోకస్ పెట్టారని టీడీపీ కేడర్ అభిప్రాయపడుతోందట. అందుకే, ఇకపై నేతల ఎంపిక వ్యాపారాలతో సంబంధం లేకుండా జరగాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయట.

అయితే, వ్యాపార వేత్తల అండదండలు లేకుండా పార్టీలు మనుగడ సాగించగలవా అన్నది భేతాళ ప్రశ్న. సొంత రాష్ట్రంలో వ్యాపారాలున్నవారు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పార్టీకి పెద్దగా ఉపయోగపడరన్నది బహిరంగ రహస్యమే.. వారు తమ తమ పార్టీలకు డబ్బులు ఖర్చుపెడతారు తప్ప పార్టీ బలోపేతానికి, సంస్థాగత నిర్మాణానికి కస్టపడతారన్నది దురాశే. కాబట్టి వారి నుంచి క్రియాశీల రాజకీయాలు ఆశించడం అత్యాశే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.