ఇదో ఉచిత రాజ‌కీయం.. వినితీరాలి!

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కులు ఉచిత హామీలు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అస‌లు ఉచితాలంటే ప‌డ‌ని, గిట్ట‌ని పార్టీలు, నాయ‌కులు కూడా ఇప్పుడు ఉచిత భ‌జ‌న చేస్తున్నారు. దాదాపు 1000 రూపాయ‌లుగా ఉన్న వంట గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర ఎన్నిక‌లు రాగానే రూ.500 ల‌కు లోపునే ఇచ్చేస్తామ‌ని నాయ‌కులు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. దీనిలోనూ పోటా పోటీ.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ గ్యాస్‌ను రూ.450 కే ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తే.. బీజేపీకి దీటుగా కాంగ్రెస్ రూ.500ల‌లోపునే ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే.. బీజేపీ పేద‌ల‌కు మాత్ర‌మే ఉచితం ప‌రిమిత‌మ‌న‌గా.. కాంగ్రెస్ మాత్రం 25 వేల లోపు ఆదాయం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఇచ్చేస్తామ‌ని హామీ గుప్పించింది.

ఇక‌, మ‌హిళ‌ల‌కు బ‌స్సు ప్ర‌యాణాలు ఇరు పార్టీలు ఉచితంగానే ఊరిస్తున్నాయి. సామాజిక పింఛ‌న్ల‌ను రూ.2000 చేస్తామ‌ని ఒక పార్టీ.. కాదు దీనిని 3000ల‌కు పొడిగిస్తామ‌ని(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజస్థాన్‌ల‌లో ఇవి త‌క్కువ‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం రూ.1500లే ఇస్తున్నారు) బీజేపీ, కాంగ్రెస్‌లు పోటా పోటీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నాయి. ఇక‌, చ‌దువుకునే అమ్మాయిల‌కు స్కూటీలిస్తామ‌ని తాజాగా బీజేపీ అగ్ర‌నేత‌.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. వాస్త‌వానికి ఇది మేనిఫెస్టోలో లేద‌ని బీజేపీ నాయ‌కులు అంటున్నారు. అయితే.. ఇది ఛ‌త్తీస్‌గ‌ఢ్లో ప్ర‌క‌టించిన ప‌థ‌కం. కానీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌చారం సంద‌ర్భంగా రాష్ట్రాన్ని మ‌రిచిపోయిన‌ట్టున్న ఆయ‌న టంగ్ స్లిప్ప‌య్యారు.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. అమిత్ షా మ‌రో కీల‌క ఉచిత హామీ ప్ర‌క‌టించారు. ఇదే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్‌కు కార‌ణమైంది. అదేంటంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో ఉన్న రామ‌జ‌న్మ‌భూమిలో రామ మందిరాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇక్కడ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. జ‌న‌వ‌రి నాటికి ఆల‌యం తొలి ద‌శ పూర్త‌యి.. ప్రారంభం అయితే అవుతుంది. కానీ, సాధార‌ణ భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు మాత్రం 2024 న‌వంబ‌రు వ‌ర‌కు హీన‌ప‌క్షంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ, అమిత్ షా మాత్రం సంచ‌ల‌న హామీ ఇచ్చారు. మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు అయోధ్య రాముడి ద‌ర్శ‌నాన్ని ఉచితంగా క‌ల్పిస్తాం అని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాముడి ద‌ర్శ‌నానికి వ‌చ్చే మ‌ధ్య‌ప్ర‌దేశ్ హిందువుల‌కు రాను పోను చార్జీల్లో ఒక వైపు(భ‌క్తులు కోరుకున్న‌దానిని బ‌ట్టి) ఫ్రీగా ఇస్తామ‌న్నారు.

అంటే ట్రావెల్ చార్జీల్లో స‌గం రిఫండ్ చేస్తామ‌ని కూడా హామీ ఇచ్చారన్న‌మాట‌. నిజానికి అయోధ్య రామాల‌యంలో ద‌ర్శ‌నాలు ఉచిత‌మా? డ‌బ్బులు చెల్లించాలా? అనే విష‌యంపై క్లారిటీ లేదు. పైగా ఎంత డ‌బ్బులు పెట్టినా.. స‌ర్వ ద‌ర్శ‌నం అన్ని ఆల‌యాల్లోనూ ఉంటుంది. కానీ, అమిత్ షా మాత్రం ఏదో ఒక విధంగా అయోధ్య అంశాన్ని ప్ర‌స్తావించాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ఉచిత ద‌ర్శ‌నం హామీ ఇచ్చార‌ని నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. చివ‌ర‌కు ఉచితాల్లోకి అయోధ్య‌రాముడు కూడా వ‌చ్చేశాడ‌ని అంటున్నారు.