కాంగ్రెస్ నేతలు వేలంపాటకు సిద్ధం కండి: ఒవైసీ

ఎంఐఎం కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ కేసును కొట్టివేయడంతో కొంతకాలం పాటు అక్బరుద్దీన్ సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈరోజు సాయంత్రం నుంచి కాంగ్రెస్ నేతలను వేలం పాడతానంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

వేలంపాటకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. గతంలో తాను ప్రసంగిస్తే దేశమంతా వణికిపోయిందని, ఇప్పటికీ తనలో అదే సత్తా ఉందని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ నేతలను ఆయన హెచ్చరించారు.

అయితే, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసదుద్దీన్ ఓవైసీ షేర్వాణి లోపల పైజామా ఉందనుకున్నాను, కానీ ఖాకీ నిక్కర్ ఉందన్న సంగతి అర్థమైందని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ పై ఎంఐఎం పోటీకి అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని రేవంత్ ప్రశ్నించారు. ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి ఓవైసీ మద్దతుగా ఉంటున్నారని ఆరోపించారు.

కేసీఆర్, మోడీ వంటి దొంగలను కాపాడేందుకు ఓవైసీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. మోడీ, షాలకు సన్నిహితుడైన ఓ కీలక వ్యక్తికి తన ఇంట్లో ఓవైసీ పార్టీ ఇచ్చారని, ఆ పార్టీ ఇవ్వలేదని ఖురాన్ పై ప్రమాణం చేసేందుకు ఓవైసీ సిద్ధమా అంటూ రేవంత్ సవాల్ విసిరారు. మక్కా మసీదులో ప్రమాణం చేసేందుకు ఓవైసీ సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు. అయితే, ఆ చాలెంజ్ పై అసదుద్దీన్ ఒవైసీ స్పందించలేదు, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలపై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.