జనసేనకు కూడా తప్పలేదా ?

ఎన్నికల్లో జనసేనకు కూడా పోలిక గుర్తులతో ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఇంతకాలం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మాత్రమే కొన్ని గుర్తులు ఇబ్బందులు పెట్టేవి. ఆ ఇబ్బందులు తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో జనసేనకు కూడా ఎదురయ్యేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే జాతీయ జనసేన పార్టీ పేరుతో ఒక పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తోంది. ఆ పార్టీ తరపున కూకట్ పల్లిలో ఇద్దరు అభ్యర్ధులు కొనింటి పవన్ కల్యాణ్, నాగవెంకట వరప్రసాద్ నామినేషన్లు వేశారు.

ఇక్కడ సమస్య ఏమిటంటే వీళ్ళు నామినేషన్లు వేయటం కాదు ఈ పార్టీ గుర్తు నీళ్ళ బక్కెట్ అవ్వటమే. బ్యాలెట్ పేపర్లో కానీ లేదా ఈవీఎంల్లో కానీ జనసేన గుర్తు గాజుగ్లాసు, జాతీయ జనసేనపార్టీ గుర్తు నీళ్ళబక్కెట్ చూసేందుకు ఒకే విధంగా ఉంటాయి. రెండు గుర్తుల విషయంలో ఓటర్లు అయోమయానికి గురై జనసేనకు ఓటేయాల్సిన వాళ్ళు జాతీయ జనసేనపార్టీకి ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల గుర్తుల్లో అయోమయం వల్ల ఎంతటి అనర్ధాలు జరుగుతాయో బహుశా బీఆర్ఎస్ కన్నా ఇంకో పార్టీకి తెలీదేమో.

బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అని అందరికీ తెలుసు. అలాగే ఎన్నికల్లో పోటీలో ఉండే ఇండిపెండెంట్ అభ్యర్ధులకు ట్రాక్టర్, జీపు, రోడ్డురోలర్ లాంటి గుర్తులను కమీషన్ కేటాయిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లలో కొందరు కన్ఫ్యూజ్ అయిపోయి కారుకు వేయాల్సిన ఓట్లను ట్రాక్టర్, జీపు, రోడ్డురోలర్ గుర్తులకు వేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. పోయిన ఎన్నికల్లో ఇలాంటి కన్ఫ్యూజన్ వల్ల తొమ్మిదిమంది బీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎలాగంటే బీఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోయిన ఓట్ల మార్జిన్ కన్నా పై గుర్తులపై పోటీచేసిన అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు ఎక్కువ.

అలాంటి సమస్యే ఇపుడు జనసేనను కూడా వెంటాడుతోంది. కాకపోతే జాతీయ జనసేన పార్టీ తరపున కూకట్ పల్లిలో మాత్రమే కాకుండా ఇంకా ఎన్నినియోజకవర్గాల్లో అభ్యర్ధులు పోటీచేస్తున్నారో తెలీదు. జనసేన మాత్రం మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు కూకట్ పల్లి, కోదాడ, తాండూరు, ఖమ్మం, మధిర, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేటలో పోటీచేస్తున్న విషయం తెలిసిందే. మరి రాబోయే ఎన్నికల్లో పోలిక గుర్తుల ప్రభావం ఎలాగుంటుందో చూడాలి.