‘స‌బిత‌’కు సెంటిమెంటు దెబ్బ‌..!


రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎన్నిక‌ల్లో అయినా.. త‌ర్వాత రాజ‌కీయంగా అయినా.. సెంటిమెంటును న‌మ్ముకున్న‌వారే రాజ‌కీయాల్లో స‌క్సెస్ అవుతున్నారు. ఇలానే దాదాపు రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో సెంటిమెంటును న‌మ్ముకుని విజ‌య తీరం చేరుతున్నారు మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్న ఈ కుటుంబం.. అనేక ప‌దువులు కూడా చేప‌ట్టింది.

ముఖ్యంగా కాంగ్రెస్‌కు, ఇటు మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఇంద్రారెడ్డి చేసిన త్యాగాలు, చేసిన కృషిని నిన్న మొన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఏక‌రువు పెడుతూనే ఉన్నారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో స‌బిత విజ‌యం సునాయాసంగా సాగిపోతోంది. ఇంద్రారెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత‌.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రోత్సాహంతో చేవెళ్ల‌(గ‌తంలో జ‌న‌ర‌ల్‌.. ఇప్పుడు ఎస్సీ) నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు.

ఈ క్ర‌మంలోనే 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. కేసీఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష‌క్‌తో ఆమె సుదీర్ఘ కాలం కొన‌సాగిన పార్టీని వ‌దులుకుని బీఆర్ ఎస్‌కు జై కొట్టారు. అనంత‌రం.. మంత్రి కూడా అయ్యారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌హేశ్వ‌రం బ‌రి నుంచిబీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీలోనూ ఉన్నారు. కానీ, కాంగ్రెసేత‌ర పార్టీల నుంచి పోటీ చేయ‌డం ఇదేతొలి సారి కావ‌డంతో త‌న‌కు సంప్ర‌దాయంగా వ‌స్తున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు స‌డ‌లిపోకుండా చూసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కానీ, ఇప్పుడు ప్ర‌జ‌లు సెంటిమెంటుకు ప‌డిపోవ‌డం లేదు. ఆమె పార్టీ మార‌కుండా ఉండి ఉంటే.. ఇది ప‌నిచేసి ఉండేద‌ని అంటున్నారు. పార్టీ మారిపోయారు. పైగా.. పెద్ద‌గా అధికారాలు ఏవీ లేని మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. దీంతో |క్షేత్ర‌స్థాయిలో స‌బిత‌కు వ్య‌తిరేక‌త లేక‌పోయినా.. సానుభూతి, సానుకూలత అయితే.. గ‌తంలో ఉన్నంత లేవ‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.