పురందేశ్వరి చంద్రముఖిగా మారారు: అప్పలరాజు

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై కొద్ది రోజులుగా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పురంధేశ్వరి ఖండించిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు తదితరులు…పురంధేశ్వరిపై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురంధేశ్వరిపై మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పురందేశ్వరి రోజు మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో అని అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఏపీలో మద్యం అమ్మకాలపై పురందేశ్వరి కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిపై స్పందించిన అప్పలరాజు..ఇలా పురంధేశ్వరిపై నోరు జారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను మద్యం తాగనని, తనకు మద్యం టేస్ట్ లపై అవగాహన లేదని చెప్పిన అప్పలరాజు…మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని ఆరోపించారు.

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పురందేశ్వరికి కొంచెం గౌరవం ఉండేదని, కానీ, బీజేపీలో చేరిన తర్వాత చంద్రముఖిగా మారారని సెటైర్లు వేశారు. బీజేపీలోనూ పురందేశ్వరికి గౌరవం లేదని, ఆ పార్టీలో ఆమె ఉండడం అనవసరమని, టీడీపీలో చేరితే సరిపోతుందని సెటైర్లు వేశారు. మరి, అప్పల రాజు వ్యాఖ్యలపై పురందేశ్వరి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.