ప్రచార రథంపై నుంచి పడిన కేటీఆర్

మరి కొద్దిరోజుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేత, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ ప్రచార రథం వ్యాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనంపై ఉన్న రెయిలింగ్ పై కేటీఆర్ పడిపోయారు.

కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా రెయిలింగ్ పై పడడంతో అది వ్యాన్ ముందుకు పడిపోయింది. అయితే, కేటీఆర్ వ్యాన్ పైనే పడిపోగా…ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి వాహనంపై నుంచి పూర్తిగా కిందకు పడిపోయారు. ఈ ఘటనలో కేటీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డిలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కేటీఆర్ పొత్తికడుపులో రెయిలింగ్ సేఫ్టీ రాడ్ గట్టిగా ఒత్తుకున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక ఆసుపత్రిలో వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.

అయితే, తన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, ప్రజలు ఆందోళన చెందవద్దని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కొడంగల్ లో రోడ్ షో పాల్గొనేందుకు కేటీఆర్ బయలుదేరతారని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.