అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు..కండిషన్స్ అప్లై

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టైన అచ్చెన్నాయుడుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో 2 రోజుల్లో అచ్చెన్నాయుడు బెయిల్‌పై విడుదల కానున్నారు.

ఈఎస్ఐ స్కాంలో 70 రోజులుగా రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడుకు తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయనకు ఊరట లభించినట్లయింది. అయితే, ఆగస్టు 25న అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదనలు జరిగాయి.

వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు…తాజాగా శుక్రవారం నాడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టైన అచ్చెన్న అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా పాజిటివ్ రాగా.. ప్రస్తుతం ఆయన ఎన్‌ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. ఆనాడు మంత్రి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు….వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు జూన్ 12న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే ఓ సర్జరీ చేయించుకొని అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న అచ్చెన్నాయుడును ఆస్పత్రిలో చేరేందుకు కోర్టు అనుతిచ్చింది. ఆసుపత్రిలోనే ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్న సమయంలో అచ్చెన్నకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో, గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు అచ్చెన్నకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.