అసమ్మతికి కాంగ్రెస్ తలొగ్గుతుందా?

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సాగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న గ్రాఫ్ ను, ఏర్పడుతున్న సానుకూల పవనాలను అనుకూలంగా మార్చుకుని విజయం సాధించాలని చూస్తోంది. అందుకే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. పార్టీకి నష్టం కలిగే విషయాలపై ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటోంది. ఈ సారి టికెట్ల కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన డిమాండ్ నెలకొంది. ఇప్పటికే 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు అసమ్మతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్లిపోయారు.

ఇప్పుడు ఈ అసమ్మతిని తగ్గించేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. అసంత్రుప్తి నేతలను బుజ్జగించేందుకు కొంతమంది నాయకులకు బాధ్యతలు అప్పజెప్పింది. అంతే కాకుండా పార్టీ నాయకులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని పార్టీ అనుకుంటున్నట్లు తెలిసింది. టికెట్లు దక్కించుకున్న నాయకులు ఇప్పటికే ప్రచారం షురూ చేశారు. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవడంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరీ ఆలస్యం చేయకుండా సుమారు ఓ అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అయిదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు కాంగ్రెస్ చర్చిస్తుందని తెలిసింది. ఇందులో ముఖ్యంగా మూడు స్థానాల్లో అభ్యర్థులకు బీ ఫాం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. వనపర్తి అభ్యర్థి జి.చిన్నారెడ్డి, చేవెళ్ల అభ్యర్థి భీంభరత్, బోథ్ అభ్యర్థి వన్నెల అశోక్ కు బీం ఫామ్ లు ఇవ్వొద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు టాక్. ఈ ముగ్గురు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం ఎలాంటి కసరత్తులు చేయడం లేదని తెలిసింది. అందుకే వీళ్ల స్థానాల్లో ఇతర నాయకులను ప్రకటించి, అప్పుడు బీం ఫామ్ లు ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు సమాచారం.