కామారెడ్డిలో కేసీయార్ Vs రేవంత్ ?… బిగ్ ఫైట్ తప్పదా ?

తెలంగాణా మొత్తంమీద కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ హోరెత్తిపోబోతోందా ? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీచేయబోతున్నారు. 10వ తేదీన నామినేషన్ వేయబోతున్నారు.  ఇప్పటికే కొడంగల్లో పోటీకి రెడీ అయిన రేవంత్ రెండో నియోజకవర్గంగా కామారెడ్డిలో పోటీకి రెడీ అవుతున్నారట. రేవంత్ పోటీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ రేవంత్ పోటీచేస్తే రాష్ట్రమంతా ఎందుకు హోరెత్తిపోతుంది ?

ఎందుకంటే ఇక్కడనుండే కేసీయార్ కూడా పోటీచేయబోతున్నారు కాబట్టే. కేసీయార్ కూడా రెండు నియోజకవర్గాలు గజ్వేలు, కామారెడ్డిలో పోటీచేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గజ్వేలులో నామినేషన్ వేశారు. ఇక కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయాల్సుంటుంది. గతంలో కేసీయార్ ఎప్పుడూ రెండు నియోజకవర్గాల్లో పోటీచేసింది లేదు. రెండు నియోజకవర్గాల్లో పోటీచేసినా గెలుపుకు ఢోకాలేదని, బీఆర్ఎస్ విజయం ఖాయమని జనాలందరికీ చాటి చెప్పేందుకే కేసీయార్ రెండుచోట్ల నుండి పోటీచేస్తున్నారు.

తాజా పరిణామాల ప్రకారం కామారెడ్డిలో కేసీయార్-రేవంత్ పోటీ ఖాయమైపోయింది. దాంతో ఈనియోజకవర్గంలో బిగ్ ఫైట్ తప్పదనే ప్రచారం మొదలైంది. గ్రౌండ్ రిపోర్టు ప్రకారమైతే బీఆర్ఎస్ మీద జనాల్లో వ్యతిరేకత ఉంది. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళ బాధిత  కుటుంబాలు, కొందరు గిరిజనులు కేసీయార్ పై బాగా మండిపోతున్నారు. తమకిచ్చిన హామీలను కేసీయార్ తుంగలో తొక్కేశారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే వివిధ పథకాల్లో లబ్దిదక్కని జనాలు కూడా కోపంగా ఉన్నారు. అర్హులైన తమను కాదని అనర్హులకు పథకాలు వర్తింపచేస్తున్నారని బాగా కోపంతో ఉన్నారు.

వీళ్ళంతా ఒకఎత్తయితే కామారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని రైతులు కూడా బాగా కోపంతో ఉన్నారు. తమ భూములను మున్సిపల్ అధికారులు మాస్టర్ ప్లాన్  పేరుతో ఏకపక్షంగా తీసేసుకున్నారంటు గోలచేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దుచేయకపోతే తాము కూడా నామినేషన్లు వేస్తామంటు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు. అయితే వీళ్ళ హెచ్చరికలను కేసీయార్ ఏమాత్రం లెక్కచేయలేదు. ఇలా వివిధ వర్గాలు అనేక కారణాలతో కేసీయార్ అంటే మండిపోతున్నారు. వీళ్ళంతా ఏకతాటిపైకి వచ్చి మద్దతు పలికితే రేవంత్ ఇక్కడ గెలిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు.