సుప్రీంకోర్టుకు ఎందుకు లేఖ రాశారు ?

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు సుప్రీంకోర్టుకు లేఖ రాయటంపై ఇఫుడు పెద్ద చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి బెయిల్ వెంటనే రద్దు చేయాలని పురందేశ్వరి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్ధలోని లోపాలను అడ్డుపెట్టుకుని విజయసాయి అరాచకాలకు పాల్పడుతున్నట్లు లేఖలో ఆమె ఆరోపణలు చేశారు. కాబట్టి జగన్, విజయసాయి బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని ఆమె కోరారు. సరే ఆమె లేఖపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్నది వేరే విషయం.

అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏపీలో ఆమె అధ్యక్షురాలు. అయినప్పటికీ పురందేశ్వరి కేంద్ర ప్రభుత్వానికి కాకుండా డైరెక్టుగా సుప్రీంకోర్టుకు ఎందుకు లేఖ రాశారు ? మామూలుగా అయితే కోర్టులకు లేఖలు రాసి ఫిర్యాదులు చేసేది ప్రతిపక్ష నేతలే కానీ అధికార పార్టీ నేతలు కాదు. ఈ విషయం తెలియకుండానే పురందేశ్వరి సుప్రింకోర్టుకు లేఖ రాసుంటారని అనుకునేందుకు లేదు. మరి ఈ విషయం తెలిసి కూడా ఎందుకు లేఖ రాసినట్లు ?

ఎందుకంటే జగన్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని పురందేశ్వరి తీర్మానించుకున్నారట. ఇప్పటికే కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మీద పురందేశ్వరి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం నుండి సానుకూల స్పందన కనబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఇసుక, మద్యం కుంభకోణాలపైన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖలు రాయటమే కాకుండా వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదులు కూడా చేశారు.

అయినా కేంద్రంలో కదలిక కనబడలేదు. దాంతో జగన్ పైన కేంద్రానికి ఫిర్యాదులు చేసినా, లేఖలు రాసినా ఎలాంటి ఉపయోగం ఉండదని పురందేశ్వరికి అర్ధమైపోయింది. అందుకనే కేంద్రానికి కాకుండా డైరెక్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదులతో కూడిన లేఖను రాశారు. అయితే సుప్రింకోర్టు మాత్రం స్పందిస్తుందని గ్యారెంటీ ఏమిటి ? ఇక్కడ గ్యారెంటీ ఏమీలేదు కానీ సుప్రింకోర్టుకు ఫిర్యాదుచేసినా ఎవరు పట్టించుకోలేదని, చర్యలు తీసుకోలేదని పురందేశ్వరి రేపటి ఎన్నికల్లో చెప్పుకోవటానికి మాత్రం ఉపయోగపడుతుంది.