19 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం

వైసీపీ పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ను చూసి వ్యాపారవేత్తలు భయపడుతున్నారని, అందుకే, ఏపీకి రావాల్సిన పలు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శిస్తున్న విషయం విదితమే. విశాఖ పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు పాల్గొని దాదాపు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖలో టైర్ల పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాల్లో భారీగా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాయి. అయినా సరే ప్రతిపక్ష నేతల విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఆ విమర్శలకు చెక్ పెట్టేలా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేలా మరిన్ని సంస్థలకు రెడ్ కార్పెట్ వేసింది.

జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మండలి సమావేశంలో రూ. 19 వేల కోట్ల పెట్టుబడులతో పలు పరిశ్రమల స్థాపనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో దాదాపు 19 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు బహుళ జాతి సంస్థలు ముందుకు వచ్చాయి. పారిశ్రామికవేత్తల అవసరాల మేర భూములివ్వడంతోబాటు పలు రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.

నెల్లూరులోని కృష్ణపట్నం దగ్గర రిలయన్స్ పవర్ ఆధ్వర్యంలో రూ. 6174 కోట్ల పెట్టుబడితో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం దగ్గరున్న పారిశ్రామికవాడలో స్మైల్ కంపెనీ రూ.166 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థ పెట్టేందుకు ముందుకు వచ్చింది. 5000 వేల మందికి ఉపాధి ఆ సంస్థ ఇవ్వనుంది. సెజ్ లో ఉన్న ఏటీసీ టైర్స్ సంస్థ రూ. 679 కోట్లతో సంస్థను విస్తరించనుండగా..దానిలో కొత్తగా 300 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ఏలూరులో కొమ్మూరువద్ద రూ. 114 కోట్లతో వెంకటేశ్వర బయోటెక్ సంస్థ, తిరుపతిలో రూ. 933 కోట్లతో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ సంస్థ విస్తరించనుండగా..దానివల్ల 2100 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. కడియం వద్ద ఉన్న ఆంధ్రపేపర్ మిల్లు విస్తరణకు ఆ సంస్థ రూ. 4,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. విజయనగరంలోని ఎస్. కోట వద్ద రూ. 531 కోట్లతో జేఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కులో ప్రత్యక్షంగా 35,750 మందికి , పరోక్షంగా 9375 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ జిల్లా పద్మనాభం వద్ద రూ. 50 కోట్లతో ఓరిల్ ఫుడ్స్ సంస్థ ఏర్పాటు కానుంది.