కాసానికి రాజాసింగ్ సీట్- టీడీపీ నుంచి వస్తే గోషామహలేనా?

తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ కన్నేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించే దిశగా ఆయన సాగుతున్నారు. రాష్ట్రంలో ఈ సారి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో తెలంగాణలోని చాలా చోట్ల బీఆర్ఎస్ కు తిరుగులేకుండా పోయింది. కానీ కొన్ని స్థానాల్లో ఎంత ప్రయత్నించినా విజయం మాత్రం దక్కడం లేదు. ఇందులో గోషామహల్ ఒకటి. ఇప్పుడు గోషామహల్ పై కన్నేసిన కేసీఆర్.. ఇక్కడ కాసాని జ్ణానేశ్వర్ రావును బరిలో దింపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండటంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసిన కాసాని బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు గోషామహల్ టికెట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే కేసీఆర్.. గోషామహల్ టికెట్ కేటాయించడం ఆనవాయితీగా మారిందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రేమ్ కుమార్ ధూత్, 2018 ఎన్నికల్లో ప్రేమ్ సింగ్ రాథోడ్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఇద్దరూ తమ రాజకీయ జీవితాన్ని టీడీపీతోనే మొదలెట్టడం విశేషం. బీఆర్ఎస్ లోకి వలస వచ్చిన ఈ నాయకులను కేసీఆర్ గోషామహల్ లో నిలబెట్టారు. కానీ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ జోరు ముందు ఈ నాయకులు తేలిపోయారు. ఇక మరో విశేషం ఏమిటంటే.. రాజాసింగ్ కూడా టీడీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు.

ఈ సారి కూడా గోషామహల్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రాజా సింగ్ చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి సునీతరావు ముదిరాజ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాసానిని గోషామహల్ లో పోటీ చేయిస్తే రెండు రకాలుగా ప్రయోజనం పొందొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఓ వైపు ముదిరాజ్ నాయకుడికి టికెట్ ఇచ్చాననే పేరుతో ముదిరాజ్ లను శాంతింపజేయొచ్చు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ముదిరాజ్ నాయకురాలు సునీతకు చెక్ పెట్టొచ్చని కేసీఆర్ చూస్తున్నట్లు తెలిసింది.