ఇంతకాలానికి తప్పు ఒప్పుకున్నారా ?

తప్పు జరిగిన ఇంతకాలానికి అదీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ తప్పొప్పుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రూప్ పరీక్షల నిర్వహణలో టీఎస్ పీఎస్సీలో తప్పులు జరిగినట్లు కేటీయార్ అంగీకరించారు. అధికారంలోకి రాగానే మొత్తం టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. అధికారంలో ఉన్న పదేళ్ళల్లో టీఎస్ పీఎస్సీ బోర్డు నియామకాలను రాజకీయంగా భర్తీ చేసేసి గబ్బు పట్టించారు. బోర్డేమే పరీక్షల నిర్వహణలో దారుణంగా ఫెయిలైంది.

గ్రూప్ 1, 2, 3 పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకల కారణంగా లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో బోర్డు ఆడుకుంది. కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయినా బోర్డులో ఎవరిమీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. బోర్డు ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఈగ వాలనియ్యలేదు. ప్రవేశ పరీక్షల పేపర్ల లీకేజీలపై కేసీయార్, కేటీయార్ కనీసం నోరుకూడా విప్పలేదు. అలాంటిది ఇపుడు అదికూడా ఎన్నికల సమయంలో కేటీయార్ తప్పు ఒప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

పదేళ్ళు బోర్డును అన్నీ విధాలుగా నాశనం చేసేసి మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామని ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో తప్పులు జరిగినట్లు అంగీకరించిన కేటీయార్ ఎవరిమీదా ఎందుకని యాక్షన్ తీసుకోలేదో చెప్పగలరా ? జరిగిన తప్పులన్నీ అధికారపార్టీ నేతల ప్రమేయంతోనే జరిగాయనే ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. జరిగిన లీకేజీల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టే బోర్డులోని ఎవరిమీదా యాక్షన్ తీసుకోలేదని అందరికీ తెలుసు.

ఈసారి అధికారంలోకి రాగానే యూపీఎస్సీ లాగే టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని తప్పుడు హామీలిచ్చారు. ఇపుడు కూడా బీఆర్ఎస్ అనుబంధ విభాగంతో మాట్లాడినపుడు తప్పులు జరిగిందని ఒప్పుకున్నారే కానీ నిరుద్యోగుల జేఏసీ తో మాట్లాడలేదు. పరీక్షల పేపర్లు వరుసగా లీకేజీలు అవుతున్నపుడు నిరుద్యోగుల జేఏసీతో మాట్లాడాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ఎన్నిసార్లు డిమాండ్లు చేసినా కేటీయార్ లెక్కకూడా చేయలేదు. మరి ఎన్నికల సమయంలో ఇపుడు తప్పు జరిగిందని చెప్పటం వెనుక ఏమి వ్యూహముందో చూడాలి.