ఆ ప్రచారాన్ని ఖండించిన వీవీ లక్ష్మీనారాయణ

వైసీపీ పాలనను పొగుడుతూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో, వైసీపీలో వీవీ లక్ష్మీ నారాయణ చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై ఆయన క్లారిటీనిచ్చారు. ఆ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని, ఇటువంటి ప్రచారాలపై ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలిపారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగిస్తానని, వైసీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

శ్రీశైలంలో తన బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోందని, అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారు శ్రీశైలంలో పర్యటిస్తున్నారని అన్నారు. దీంతో, ఆ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే ఎమ్మెల్యేను కలిశానని అన్నారు. అదే సమయంలో వైద్య పరీక్షలకు సంబంధించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి తనను ఆయన ఆహ్వానించారని చెప్పారు. ఆ సందర్భంగా వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించానని చెప్పుకొచ్చారు.

అంతమాత్రానికే తాను వైసీపీలో చేరుతున్నానని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేయబోతున్నానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు. మరి, ఈ క్లారిటీ తర్వాత వీవీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారన్న ప్రచారానికి తెరపడుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక, రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.