ఒక పిలుపునకు ఇన్ని వేల మందా?

అసలే ఎన్నికల కాలం. నలుగురిని పోగేయాలంటే నానా గడ్డి కరవాలి. వేలాది రూపాయిలు ఖర్చు చేయాలి. కానీ.. ఒక పిలుపుతో.. వేలాది మంది ఒకచోటుకు చేరటం.. అది కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి కార్యక్రమం ‘‘ఐయాం విత్ సీబీఎన్’’ పేరుతో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. దీనికి వేలాది హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. వచ్చినోళ్లలో అత్యధికులు యువత కావటం ఒక ఎత్తు అయితే.. భార్యపిల్లలతో.. పెద్ద వయస్కుల వారితో కళకళలాడింది.

ఈ కార్యక్రమం జెండా.. ఎజెండా ఒక్కటే. జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావాన్ని తెలిపేందుకు వీలుగా నిర్వహించిన ఈ సభకు గచ్చిబౌలి స్టేడియం నిండిపోవటం ఒక ఎత్తు అయితే.. వాహనాలు పోటెత్తిన కారణంగా ట్రాఫిక్ జాం ఎదురైన పరిస్థితి. సరైన స్పీకర్లు పెద్దగా లేనప్పటికి.. చంద్రబాబుకు తమ సంఘీభావం తెలపాలన్న ఒక్క ఎజెండాకు ఇంతటి స్పందనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామతో పాటు.. సినీ నిర్మాత బండ్ల గణేశ్ తో పాటు.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. రోటీన్ పొలిటికల్ పార్టీ సమావేశాలకు భిన్నమైన వాతావరణంలో.. ఒక కుటుంబ గెట్ టు గెదర్ చందంగా మారిన ఈ సభ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించారు. కానీ.. ఈ తరహా సభ ఇప్పటివరకు నిర్వహించలేదన్నమాట వినిపిస్తోంది.

ఎవరికి వారు చంద్రబాబు విజన్ గురించి.. ఆయన గొప్పతనం గురించి.. ఆయన ముందుచూపు కారణంగా తమ జీవితాల్లో వచ్చిన మార్పు గురించి.. తెలుగుజాతికి చంద్రబాబు చేసిన గొప్పపనుల గురించి కీర్తించిన వైనం సరికొత్త అనుభూతిని కలిగించేలా చేసింది. ఈ సభలో మాట్లాడిన ఒక ప్రముఖుడు అన్నట్లు.. సాధారణంగా ఒక వ్యక్తి గొప్పతనాన్ని అతను పోయిన తర్వాత మాట్లాడతారు. కానీ.. అందుకు భిన్నంగా బతికి ఉన్నప్పుడే ఇంతటి పొగడ్తల్ని సొంతం చేసుకోవటం సీబీఎన్ కు మాత్రమే సొంతమన్న మాట పలువురి నోట వినిపించింది.