చంద్రబాబుది తెలివైన నిర్ణయమేనా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఒంటరిపోటీకే తెలుగుదేశంపార్టీ మొగ్గుచూపింది. ఈ విషయాన్ని తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరే స్వయంగా చెప్పారు. రాజమండ్రి జైలులో చంద్రబాబునాయుడుతో భేటీ తర్వాత ఒంటరిపోటీ విషయం డిసైడ్ అయ్యిందన్నారు. కాసాని తాజా ప్రకటనతో తెలంగాణాలో పోటీకి టీడీపీ దూరంగా ఉండబోతోందనే ప్రచారానికి తెరపడింది. కాకపోతే ఎన్ని స్ధానాల్లో పోటీచేయాలి ? ఏ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను నిలపాలనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. లోకేష్ తో భేటీ అయిన తర్వాత ఈ రెండు విషయాలు ఫైనల్ అవుతాయని చెప్పారు.

మొత్తానికి పోటీచేసే విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో పార్టీకి కాస్త ఊపిరిలూదినట్లయ్యింది. రాజకీయ పార్టీ అన్నాక ఎన్నికల్లో పోటీచేయకపోతే ఆత్మహత్య చేసుకోవటంతో సమానమే అని అందరికీ తెలుసు. అందుకనే రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలుండవని పెద్దలు చెప్పేది. చంద్రబాబు తాజా నిర్ణయంతో పార్టీకి ఆ పరిస్ధితి తప్పిందనే అనుకోవాలి. మొదట్లో 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని కాసాని ప్రకటించారు. తర్వాత 89 స్ధానాల్లోనే పోటీచేస్తామని చెప్పారు.

ఇపుడేమో మళ్ళీ 119 నియోజకవర్గాల్లోను పోటీచేసే విషయంపై తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏదేమైనా ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే నవంబర్ 3వ తేదీలోగా నియోజకవర్గాల సంఖ్య, అభ్యర్ధులను ఫైనల్ చేసేయటం ఖాయమనే అనిపిస్తోంది. ఇపుడు గనుక పోటీకి దూరంగా ఉండుంటే దీని ప్రభావం రాబోయే ఏపీ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉండేది. పోటీకి దూరంగా ఉండటానికి చంద్రబాబుకు వంద కారణాలుండచ్చు. కానీ బాగా హైలైట్ అయ్యేది మాత్రం ఎన్నికల్లో ఓటమికి భయపడే తెలంగాణా ఎన్నికల్లో పోటీచేయలేదనే.

ఓడిపోయినా పర్వాలేదు కానీ పోటీచేయాల్సిందే అన్న చంద్రబాబు నిర్ణయమే తెలంగాణాలో పార్టీని బతికిస్తుందనటంలో సందేహంలేదు. ఇక పోటీచేయబోయే నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాలు, అభ్యర్ధులు ఎవరన్నది పెద్ద పాయింట్ కాదు. ఎన్నికలన్నాక ఎవరో పోటీచేయటం మామూలే. అన్నీ పార్టీలోను బలమైన, బలహీనమైన అభ్యర్ధులు ఉండటం చాలా కామన్. పార్టీ ఓటుబ్యాంకును, క్యాడర్ను కాపాడుకోవటమే ఏ పార్టీకైనా చాలా అవసరం. చంద్రబాబు ఇపుడు చేస్తున్నది కూడా అదే. మరి ఫలితాలు ఎలాగుంటాయో చూడాలి.