పురందేశ్వ‌రి మందు తాగుతారేమో: విజ‌య‌సాయిరెడ్డి

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, ఆ పార్టీ ఎంపీ వి. విజ‌య‌సాయిరెడ్డి.. బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిపై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. పురందేశ్వ‌రి మందు తాగుతారేమో.. ఆమెకు కేరాఫ్ లేదు. గ‌తంలో ఆమె ఏమేం ప‌నులు చేశారో.. మాకు అన్నీ తెలుసు. ఆ నీచ‌మైన ప‌నుల‌ను బ‌య‌ట పెట్ట‌డం సంస్కారం కాదు కాబ‌ట్టి.. ఒక మ‌హిళ‌గా ఆమె ప‌ట్ల మాకు సానుభూతి ఉంది కాబ‌ట్టి వాటిని బ‌య‌ట పెట్ట‌డం లేదు. అవ‌న్నీ బ‌య‌ట పెడితే.. పురందేశ్వ‌రి చివ‌ర‌కు ఏం అఘాయిత్యం చేసుకుంటారో కూడా చెప్ప‌డం క‌ష్టం అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

తాజాగా వైసీపీ చేప‌ట్టిన సామాజిక న్యాయ బ‌స్సు యాత్ర బాప‌ట్ల జిల్లాలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం రాత్రి నిర్వ‌హించిన స‌మావేశంలో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడారు. త‌న‌పైనా.. వైసీపీ ఎంపీ, పార్టీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నాయ‌కుడు మిథున్‌రెడ్డిపైనా గ‌త కొన్నాళ్లుగా పురందేశ్వ‌రి చేస్తున్న లిక్క‌ర్ సిండికేట్ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. నాకు కానీ, మిథున్ రెడ్డికి కానీ.. లిక్క‌ర్‌లో అస‌లు ఏయే బ్రాండ్లు ఉన్నాయో..ఉంటాయో కూడా తెలియదు. మాకు ఆ వ్యాపారంతో సంబంధం లేదు. కానీ, పురందేశ్వ‌రి మాత్రం ఈ విష‌యంలో బాగా అనుభ‌వం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆమె మందు తాగుతారేమో.. కానీ, నేను మందు ముట్ట‌ను, క‌నీసం నాన్ వెజ్ కూడా తిన‌ను అని సాయిరెడ్డి అన్నారు.

అంతేకాదు..త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేసే ముందు.. నిజాలు తెలుసుకుని మాట్లాడితే.. పురందేశ్వ‌రి విష‌యంలో మేం కూడా అలానే వ్య‌వ‌హ‌రిస్తామ‌ని సాయిరెడ్డి అన్నారు. అలా కాకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే.. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో ఆమె ఎన్ని చిందులు తొక్కారో మాకు తెలుసు. ఎన్ని నీచ‌మైన ప‌నులు చేశారో కూడా తెలుసు. అవ‌న్నీ ఇప్పుడు బ‌య‌ట పెడితే.. ఆమె ఏమైపోతారో అనే ఆందోళ‌న‌తో ఓ మ‌హిళ‌గా.. మా పార్టీ మ‌హిళ‌ల‌కు ఇచ్చే గౌర‌వాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని బ‌య‌ట పెట్ట‌డం లేదు అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

విశాఖ‌ప‌ట్నం ఎంపీ స్థానానికి ఇంచార్జిగా ఉన్న భ‌ర‌త్‌, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కుమారుడు హితేష్ చేస్తున్న వ్యాపారాల‌ను బ‌య‌ట పెట్టాలా? అని ప్ర‌శ్నించారు. వారిద్ద‌రూ త‌న‌పైనా, మిథున్‌రెడ్డిపైనా చెప్పిన మాట‌ల‌ను ప‌ట్టుకుని పురందేశ్వ‌రి విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ఆమె గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. విశాఖ నుంచి పోటీ చేశారు. త‌ర్వాత బీజేపీలోకి వ‌చ్చి రాజంపేట నుంచి పోటీ చేశారు. ఆమెకు అస‌లు కేరాఫే లేదు. నును రాజ్య‌స‌భ స‌భ్యుడిని నాకు ఒక నియోజ‌క‌వ‌ర్గం ఉండ‌దు. మ‌రి పురందేశ్వ‌రి కూడా అలానే ఉంటారా? కేరాఫ్‌లేని వ్య‌క్తిగా ఆమె మా గురించి మాట్లాడ‌డం త‌గ‌దు.. అని వ్యాఖ్యానించారు.