తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై క్లారిటీ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక, తెలంగాణలో టీటీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటూ ప్రచారం జరుగుతోంది. చాలాకాలంగా తెలంగాణలో సుప్తచేతనావస్థలో ఉన్న టీడీపీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి పార్టీకి పునర్వైభవం తేవాలని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు అరెస్టు రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

టీడీపీ తరఫు నుంచి అధికారిక ప్రకటన లేకపోవడంతో అది ప్రచారంగానే మిగిలింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రచారంపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయం తీసుకోలేదని క్లారిటీనిచ్చారు. టీటీడీపీపై కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని, ఇదంతా కుట్ర అని మండిపడ్డారు.

ఎన్నికల్లో పోటీకి 75 మంది అభ్యర్థుల జాబితా కూడా రెడీ అయిందని, చంద్రబాబు జైల్లో ఉండటంతో పేర్లు ప్రకటించే విషయంలో నిర్ణయం తీసుకోవడంతో జాప్యం జరుగుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని కాసాని భావిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత కాసాని కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.