బీఆర్ ఎస్‌కు 70 సీట్లు ప‌క్కా.. తాజా స‌ర్వే వెల్ల‌డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్ ఆధిప‌త్యం సాధిస్తుంద‌ని, మెజారిటీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని తాజాగా ఓ స‌ర్వే వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌కు 70 స్థానాలు ల‌భిస్తాయ‌ని తెలిపింది. అయితే, అధికారంలోకి వ‌చ్చేందుకు మాత్రం వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ఇండియా టీవీ సంస్థ త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను తాజాగా వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకునేందుకు బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లు పోటా పోటీగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌చార‌ప‌ర్వానికి కూడా తెర‌దీశాయి. ఈ నేప‌థ్యంలో ఇండియా టీవీ సంస్థ గ‌త నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం..
బీఆర్ ఎస్ పార్టీకి 70 స్థానాలు
కాంగ్రెస్ పార్టీకి 34 స్థానాలు
బీజేపీకి 7 స్థానాలు
ఎంఐఎం పార్టీ 7 స్థానాలు
ఇత‌రులు 1 స్థానంలో విజ‌యం ద‌క్కించుకోనున్నారు.

త‌మ స‌ర్వే.. ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభ‌మైన త‌ర్వాత చేసింద‌ని ఇండియా టుడే సంస్థ పేర్కొంది. అయితే.. 2018లో బీఆర్ ఎస్ పార్టీకి 88 స్థానాల్లో విజ‌యంద‌క్కింది. దీంతో ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రంలేకుండా పోయింది. కానీ, ఇప్పుడు ఈ స‌ర్వే క‌నుక నిజ‌మైతే.. వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే..ఇప్ప‌టికే ఎంఐఎంతో పొత్తు ఉన్న నేప‌థ్యంలో ఇరు పార్టీలూ క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వే సంస్థ అభిప్రాయ‌ప‌డింది.

ఇదిలావుంటే, తెలంగాణ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక స‌ర్వేలు వెలుగులోకి వ‌చ్చాయి. అన్ని స‌ర్వేల్లోనూ మిశ్ర‌మ ఫ‌లితాలే వ‌చ్చాయి. కేవ‌లం ఒకే ఒక్క స‌ర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిప‌త్యం సాగించింది. ఇత‌ర స‌ర్వేల్లో మాత్రం మిశ్ర‌మ ఫలిత‌మే రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి అస‌లు ఫ‌లితంవ‌చ్చే నాటికి(డిసెంబ‌రు 3) ప్ర‌జ‌ల నాడి ఎలా ఉండ‌నుందో చూడాలి.