ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నవంబర్ 8వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం పీటీ వారెంట్ పై నవంబర్ 9వ తేదీ వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇక, నవంబర్ 9వ తేదీ వరకు చంద్రబాబును అరెస్టు చేయబోమని ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వెల్లడించారు.

అయితే, చంద్రబాబును విచారణ జరిపేందుకు అనుమతినివ్వాలని సిఐడి తరఫు లాయర్లు ధర్మాసనాన్ని కోరారు. మరోవైపు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయకూడదని చంద్రబాబు తరఫు సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సెక్షన్ 17ఏ ఫైబర్ నెట్ లో కూడా వర్తిస్తుందని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వెలువడుతుందో అని ఉత్కంఠ ఏర్పడింది.

దీంతోపాటు, చంద్రబాబు సంబంధించిన పలు పిటిషన్లు ఈ రోజు విచారణకు రానున్నాయి. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో తీర్పు రానుంది. ఇక, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును పిటి వారెంట్‌పై, చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదన్న పిటిషన్ లతోపాటు జైలులో చంద్రబాబుతో లీగల్ ములాఖత్ ల తగ్గింపును సవాల్ చేసిన పిటిషన్, చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ లిస్ట్ కోసం చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్ లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతోంది.