ఎల్లారెడ్డి రాజ‌కీయం అలా ఇలా లేదు బ్రో!

ఎల్లారెడ్డి. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. నిజామాబాద్ జిల్లాలోనే ఉన్న‌ప్ప‌టికీ.. ఇది కొంత భాగం జ‌హీరాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో ఉంది. దీంతో ఇక్క‌డ ఇటు నిజామాబాద్ ఎంపీ, అటు జ‌హీరాబాద్ ఎంపీల ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. ఇక‌, ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో అసెంబ్లీ రాజ‌కీయాలు కూడా చిత్రంగా ఉన్నాయి. పార్టీలు మారే నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం కూడా ఇదే కావడం గ‌మ‌నార్హం.

బీఆర్ ఎస్ మాజీ నాయ‌కుడు ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి ఏకంగా ఇక్క‌డ నాలుగు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ త‌ర‌ఫున ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి పోటీ చేసినా.. కాంగ్రెస్ అభ్య‌ర్థి సురేంద‌ర్ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఏనుగు ర‌వీంద‌ర్‌ను కేసీఆర్ ప‌క్క‌న పెట్టారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న సురేంద‌ర్‌కు గులాబీ బాస్ కండువా క‌ప్పి పార్టీలో చేర్చుకున్నారు.

తొలి నాళ్ల‌లో ఏనుగుకు ఎమ్మెల్సీ ఇస్తామ‌ని స్వ‌యంగా కేటీఆర్ ప్ర‌క‌టించారు. కానీ, ఇది సాకారం కాలేదు. దీంతో ఏనుగు ర‌వీంద‌ర్ వేచి చూసి.. బీజేపీలో చేరిపోయారు. ఇక్క‌డ సురేంద‌ర్ గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క‌సారి విజ‌యం ద‌క్కించుకోగా.. ఏనుగు ర‌వీంద‌ర్‌కు పోల్ మేనేజ్ మెంట్‌లో అనుభ‌వం ఉండ‌డం, నాలుగు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న అనుభ‌వం ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ మ‌రోసారి సురేంద‌ర్‌కే టికెట్ ఇచ్చింది.

ఇక‌, బీజేపీ ఇంకా జాబితా ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే, ఏనుగు ర‌వీంద‌ర్‌కు టికెట్ ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న కూడా అప్ర‌క‌టితంగా.. ప్ర‌చార ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్‌, టీడీపీలు కూడా ఎల్లారెడ్డిపై ప‌ట్టు బిగించాయి. ఈ రెండు పార్టీలు కూడా.. గ‌తంలో ఇక్క‌డ గెలిచి ఉండ‌డం, మంచి కార్య‌క‌ర్త‌లు ఉండ‌డంతో పార్టీల మ‌ధ్య ఈ సారి త్రిముఖ‌, లేదా చ‌తుర్ముఖ(టీడీపీ బ‌ల‌మైన నాయ‌కుడిని దింపితే) పోటీ త‌ప్ప‌ద‌నే చ‌ర్చ‌సాగుతోంది. అయితే.. ప్ర‌ధాన పోరు మాత్రం ఏనుగు వ‌ర్సెస్ సురేంద‌ర్ మ‌ధ్యే సాగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.