ఉలుకు ప‌లుకు లేని ష‌ర్మిల‌.. ఏం చేస్తున్నారో?!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌ర్వం ఊపందుకుంది. ప్ర‌తిపార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. టికెట్లు, అభ్య‌ర్థులు, ప్ర‌చారం, చేరిక‌లు అంటూ.. పార్టీలు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. అయితే.. అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని.. తెలంగాణ‌ను రాజ‌న్న రాజ్యంగా మారుస్తామ‌ని ఎప్పటి నుంచో చెప్పుకొచ్చిన‌.. వైఎస్సార్‌ తెలంగాణ‌పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మాత్రం కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో సైలెంట్ అయిపోయారు.

నామినేష‌న్ల‌కు ఇంకా స‌మయం ఉన్న‌ప్ప‌టికీ.. క‌నీసం ఎక్క‌డా ఎన్నిక‌ల గురించిన ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదు. అభ్య‌ర్థుల కోలాహలం కూడా పార్టీలో క‌నిపించ‌డం లేదు. ఇత‌ర పార్టీల‌ను చూస్తే.. అభ్య‌ర్థుల ఎంపిక కోలాహ‌లం క‌నిపిస్తోంది. టికెట్లు వ‌చ్చిన వారు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా.. రానివారు.. త‌మ దారి తాము చూసుకుంటున్నారు. ఇలా.. రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిన ద‌రిమిలా ష‌ర్మిల పార్టీ కూడా అంతే ఊపుతో ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు భావించారు.

కానీ, అనూహ్యంగా ష‌ర్మిల పార్టీ వ్య‌వ‌హారం ఎక్క‌డా వినిపించ‌డం లేదు. క‌నిపించ‌డం లేదు. అయితే.. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయ‌కుడు.., పార్టీ అధికార ప్ర‌తినిధి పిట్టా రామిరెడ్డి మాత్రం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. గడిచిన 4 రోజుల నుంచి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి అప్లికేషన్ తీసుకుంటు న్నామ‌న్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు 5 నుంచి 10 అప్లికేషన్లు వస్తున్నాయని తెలిపారు.

ప్రజల్లో రాజన్న బిడ్డ పై ఉన్న అభిమానం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి అద్భుతం సృష్టించబోతుం దని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గం ల నుంచి 377 అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఒక్క ఎల్బీ న‌గర్ నుంచి 10 అప్లికేషన్స్ వచ్చాయని వివ‌రించారు. మిగితా పార్టీ ల నుంచి కూడా నాయ‌కులు పోటెత్తుతున్నార‌ని చెప్పారు. ఇత‌ర పార్టీల‌కు చెందిన వారి నుంచి టికెట్ ఆశిస్తూ.. 50 అప్లిక‌ష‌న్లు వ‌చ్చాయ‌ని తెలిపారు. సీఎం కెసిఆర్ ను ఎదుర్కొనే ఒక్కే ఒక్క నాయకురాలు షర్మిల మాత్రమేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.