నాగం ఎదురు తిరిగారే?

నాగం జనార్ధన్ రెడ్డి. టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. 2012 ఉప ఎన్నికలతో కలిపి నాగర్ కర్నూల్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా పోటీ చేసేందుకు గాను కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో నాగం జనార్ధన్ రెడ్డికి కాకుండా రాకేశ్ రెడ్డికి టికెట్ దక్కింది. దీంతో నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇన్ని రోజులూ రాజేష్ రెడ్డికి నాగం జనార్ధన్ రెడ్డి మద్దతుగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. నాగం జనార్ధన్ రెడ్డి ఇష్టం మేరకే రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం కథ అడ్డం తిరిగింది. నాగం జనార్ధన్ రెడ్డి పార్టీకి ఎదురు తిరిగారు. రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోవర్టుల చేతుల్లో ఉందని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన పారాచ్యూట్ లీడర్లకు టికెట్లు ఇచ్చి తమకు నమ్మక ద్రోహం చేశారని నాగం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ల పట్ల పీసీసీ అవమానకరంగా వ్యవహరిస్తోందని నాగం అన్నారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకు కాకుండా రాజేష్ కు దక్కడంపై నాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు ఎక్కువయ్యారా? అని నాగం ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్లను పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాననే విషయాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావించారనే చెప్పాలి. మరోవైపు కొల్లాపూర్ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఇంచార్జీ జగదీశ్వర్ రావు కూడా పార్టీపై ఫైర్ అయ్యారు. కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా ఏంటో చూపిస్తానన్నారు. జగదీశ్వర్ రావుకు మద్దతుగా నిలుస్తానని నాగం పేర్కొనడం గమనార్హం.