నంద‌మూరి సుహాసిని.. ఈ సారి ప‌క్కా.. టీడీపీ స్కెచ్ ఇదే!

నంద‌మూరి కుటుంబానికి చెందిన ఆడ‌ప‌డుచు.. నంద‌మూరి సుహాసిని ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్డడం ఖాయ‌మ‌ని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయ‌కులు. ఎందుకంటే.. ఈ సారి పార్టీ వ్యూహం .. అడుగులు వేరేగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లో తొలిసారి నంద‌మూరి కుటుంబం నుంచి ఆడ‌ప‌డుచు రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది (పురందేశ్వ‌రి లైన్ వేరు). దివంగ‌త హ‌రికృష్ణ గారాల ప‌ట్టి అయిన సుహాసిని గురించి అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు.

తొలిసారి 2018 ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుహాసిని బ‌రిలో నిలిచారు. కాంగ్రెస్‌తో అప్ప‌ట్లో టీడీపీ పొత్తు ఉన్న నేప‌థ్యంలో ఈమె ఖ‌చ్చితంగా గెలిచి తీరుతార‌ని అంద‌రూ అనుకున్నారు. పైగా నంద‌మూరి బాల‌కృష్ణ వంటివారు వ‌రుస‌గా ప్ర‌చారం కూడా చేశారు. కానీ, అనూహ్యంగా సుహాసిని ఓట‌మి చ‌విచూశారు. ఇక‌, ఇప్పుడు వ‌చ్చిన అసెంబ్లీ పోరులో ఆమె మ‌రోసారి ఎన్నిక‌ల యుద్ధానికి దిగుతున్నారు.

అయితే.. ఈ సారి మాత్రం సుహాసినిని గెలిపించుకోవ‌డం ల‌క్ష్యంగా టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నంద‌మూరి సుహాసినికి ఈ ద‌ఫా రెండుస్థానాలు కేటాయించిన‌ట్టు స‌మాచారం. సెటిల‌ర్లు ఎక్కుగా ఉన్న ఎల్బీన‌గ‌ర్‌తోపాటు కూక‌ట్ ప‌ల్లి సీటును కూడా సుహాసినికి కేటాయించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ద‌ఫా ఆమెను గెలిపించుకోవాల‌ని పార్టీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఎల్బీ న‌గ‌ర్‌లో గ‌తంలో బీసీ నాయ‌కుడు ఆర్‌.కృష్ణ‌య్య కూడా టీడీపీ టికెట్ పై విజ‌యం సాధించారు. ఒక‌వైపు బీఆర్ ఎస్ ప్ర‌భావం జోరుగా ఉన్న‌ప్ప‌టికీ.. కృష్ణ య్య విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేక‌పోయారు. దీంతో ఈ సారి ఎల్‌బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుహాసిని టికెట్ కోర‌డంతో ఆమెను అక్క‌డ నుంచి బ‌రిలో దింపుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఆమె గెలుస్తారా? అసెంబ్లీలో అడుగు పెడ‌తారా? అనేది చూడాలి.